
హైదరాబాద్: అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని ప్రైవేటు పరం చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని సీపీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ రంగ ఆస్తులను కార్పొరేట్కు అప్పనంగా కేంద్రం కట్టబెడుతోందని ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంపైనా ఆయన మండిపడ్డారు. సచివాలయ భవనాలను కూల్చివేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజలంతా దీనిని ముక్తకంఠంతో వ్యతిరేకించాలన్నారు. ప్రభుత్వ వైద్యులకే ఆస్పత్రిలో అధిక చార్జీలు వేస్తుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. కరోనా వైద్యంలో పారదర్శకత లేదని దుయ్యబట్టారు.
ప్రైవేటు ఆస్పత్రులు కోరనా పేరుతో దోచుకుంటున్నాయని వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేస్తామని వెంకట్ రెడ్డి ప్రకటించారు.