హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తెలంగాణలో వచ్చే నెల 9వ తేదీన పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది.
ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారని తెలుస్తోంది. అలాగే ఇప్పటికే పూర్తయిన కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేసే కార్యక్రమాలు కూడా ఉండే అవకాశముంది.
ముఖ్యంగా MMTS Phase 2ను జాతికి అంకితం చేసే అంశం ఈ పర్యటనలో ప్రధానంగా ఉండొచ్చని సమాచారం. హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థను మెరుగుపరిచే ఈ ప్రాజెక్ట్ ప్రజా ప్రయాణానికి కీలకంగా మారనుంది. అలాగే ఎయిమ్స్ బీబీనగర్ ఆస్పత్రిని కూడా జాతికి అంకితం చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఆస్పత్రి తెలంగాణతో పాటు సమీప రాష్ట్రాల ప్రజలకు కూడా వైద్యసేవల్లో పెద్ద మార్పు తీసుకురానుంది. ఇవే కాకుండా రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారని సమాచారం.
రవాణా, కనెక్టివిటీ రంగాల్లో ఈ ప్రాజెక్టులు కీలకమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇక మరో అంశంగా మల్లారెడ్డి యూనివర్సిటీ పర్యటన కూడా ప్రధాని షెడ్యూల్లో ఉండొచ్చని చర్చ జరుగుతోంది. అయితే ఇది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదని తెలుస్తోంది. ప్రధాని మోదీ పర్యటన తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభాలు, రవాణా మౌలిక సదుపాయాల విస్తరణ, ఆరోగ్య రంగంలో కొత్త సదుపాయాలపై కేంద్రీకృతమై ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రధాని అధికారిక షెడ్యూల్ పూర్తిగా ప్రకటించాల్సి ఉంది.
.
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు: కీలక నియామకాలు
మంగ్లీ కేసు.. న్యాయవాదికి బ్రీత్ టెస్టు వివాదం.. పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్
Read Latest Telangana News And AP News And International News And Telugu News

