న్యూఢిల్లీ: 'ప్రపంచ యుద్ధాలు కావచ్చు, శాంతి స్థాపన యత్నాలు కావచ్చు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా యావత్ ప్రపంచం భారత సైనికుల వైపే చూస్తుంటుంది. మన సాహస సైనికుల సాహస విజయాలు, శాంతి యత్నాలే గుర్తుకువస్తాయి' అని ప్రధాని మోదీ భారత జవాన్లపై ప్రశంసలు కురిపించారు. బలహీనంగా ఉన్న వారెవరూ శాంతికి చొరవ తీసుకోరని, శాంతికి అవసరమైనది సాహసమేనని అన్నారు. యావత్ ప్రపంచానికి మన సైనికుల సాహసం, శాంతి యత్నాల్లో చూపించే సత్తా బాగా తెలుసునని కొనియాడారు.
గాల్వాన్ లోయలో అమరులైన సైనికులకు ప్రధాని మరోసారి నివాళులర్పిస్తూ, సైనికుల త్యాగాలు, సేవాదృక్ఫథం కారణంగా స్వయం సమృద్ధి భారతం సాధించాలన్న సంకల్పం మరింత దృఢతరమవుతోందన్నారు.

