Dailyhunt

ప్రతిపాదనలు ఇచ్చాక 4 వారాల్లో పూర్తిచేయాలి

ఎస్‌ఎ్‌ససీ, పీసీఏల ఏర్పాటుపై

తెలంగాణకు హైకోర్టు ఆదేశం

ఏపీ సర్కారుకు 4 వారాల గడువు

హైదరాబాద్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థాయి భద్రతా కమిషన్‌ (ఎస్‌ఎ్‌ససీ) పోలీసు కంప్లయింట్‌ అథార్టీ(పీసీఏ)ల ఏర్పాటుకు తమ నుంచి ప్రతిపాదనలు అందిన నాలుగు వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. పోలీసుల అనుచిత చర్యలవల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం, పోలీసు అధికారులపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం ఎస్‌ఎ్‌ససీ, పీసీఏలను ఏర్పాటు చేయాలని ఉమ్మడి హైకోర్టు 2017లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో సుమోటోగా కోర్టు ధిక్కార నోటీసులు జారీచేసింది.

గురువారం జరిగిన విచారణలో తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ వాదించారు. రాష్ట్రస్థాయి కమిషన్‌లో సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ జడ్జిలను చైర్‌పర్సన్‌గా నియమించాల్సి ఉందన్నారు. జిల్లాస్థాయిలో మాజీ జిల్లా జడ్జిలు చైర్‌పర్సన్‌లుగా ఉంటారన్నారు. ఇందుకు తగిన వారిని ముగ్గురు చొప్పున సూచించాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఈనెల 8న ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. హైకోర్టు నుంచి ప్రతిపాదనలు రాగానే ఎస్‌ఎ్‌ససీ, పీసీఏల చైర్‌పర్సన్‌లు ఇతర సభ్యుల నియామకాలు చేపడతామని చెప్పారు.

ఏపీలోనూ అంతే..

రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి ఎస్‌ఎ్‌ససీ, పీసీఏలను ఏర్పాటుకు విధి, విధానాలను రూపొందిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్‌ జీపీ హైకోర్టుకు తెలిపారు. కొవిడ్‌ కారణంగా కొంత జాప్యం జరిగిందన్నారు. ఆయా కమిషన్లు ఏర్పాటు చేయడానికి గడువు ఇవ్వాలని కోరారు. దీనికి ధర్మాసనం దీర్ఘకాల గడువు ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయా కమిషన్లను నాలుగు వారాల్లోగా నియమించాలని తేల్చిచెప్పింది. ఈమేరకు తెలంగాణ హైకోర్టు సీజే హిమాకోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీచేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy