విశాఖపట్నం, జూన్, 24 (ఆంధ్రజ్యోతి): సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాధాగాయత్రి (Radha Gayatri Case) తన భర్త శ్రీచరణ్తో కలిసి ఉత్తరాఖండ్లోని ముస్సోరీ ట్రిప్నకి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే.
ఇప్పటికే రాధాగాయత్రి మృతిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తె మృతికి అల్లుడు శ్రీచరణ్ కారణం అంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈరోజు (బుధవారం) సింహాచలంలో జరిగిన రాధాగాయత్రి అంత్యక్రియలకు శ్రీచరణ్ తల్లిదండ్రులతో పాటు రాధాగాయత్రి బంధువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడారు. తమపై వస్తోన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న సంబంధాలను వివరించారు.
ఆరోపణలను అంగీకరించను: శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్
రాధాగాయత్రి తల్లిదండ్రులు తమ కుటుంబంపై చేస్తున్న ఆరోపణలను తాను ఎంతమాత్రం అంగీకరించనని శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ తెలిపారు. రాధాగాయత్రిని పోగొట్టుకుని ఆమె తండ్రి ఎంత బాధపడుతున్నారో, అంతకన్నా ఎక్కువగా తాను బాధపడుతున్నానని చెప్పుకొచ్చారు.
నాకు మంచి ఫ్రెండ్..
'రాధాగాయత్రి నాకు మంచి స్నేహితురాలు. నేను ఒక మంచి ఫ్రెండ్ను కోల్పోయాను. మేమిద్దరం కలిసే భోజనం చేసేవాళ్లం, ఖాళీ సమయం దొరికినప్పుడు సరదాగా పేకాట కూడా ఆడుకునేవాళ్లం. ఆ స్థాయిలో మా మధ్య అనుబంధం ఉండేది. ఒకవేళ రాధాగాయత్రికి ఇష్టం లేకపోతే.. ఆమె రిషికేష్, హరిద్వార్, ముస్సోరి వంటి ప్రాంతాలకు వెళ్లేది కాదు. ఆమె ఇష్టంతోనే ఆయా ప్రాంతాలకు వెళ్లింది. ప్రస్తుతం ముస్సోరి పోలీసులు పిలవడంతో శ్రీ చరణ్ అక్కడికి వెళ్లాడు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, అవి పూర్తిగా పరిష్కారం కావడానికి కనీసం ఐదునెలల సమయమైనా పడుతుంది. ఈలోపే ఇలా జరగడం బాధాకరం' అని దుర్గాప్రసాద్ పేర్కొన్నారు.
.

