న్యూఢిల్లీ, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ''ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిని మార్చే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. కేంద్ర ప్రభుత్వంచే రూపుదిద్దుకున్న ఏపీ పునర్విభజన చట్టం ద్వారా ఏర్పాటైన రాజధానిని మరోసారి మార్చే అధికారం ముఖ్యమంత్రికిగాని, శాసనసభకు గాని లేదు. మార్పు చేయాలనుకుంటే మళ్లీ పునర్విభజన చట్టం ద్వారానే పార్లమెంటులో సవరణలతో బిల్లు చేయవలసి ఉంటుందని నేను నమ్ముతున్నా'' అని వైసీపీ ఎంపీ కే రఘురామకృష్ణమరాజు అన్నారు. ఆయన సోమవారం ఢిల్లీలో విలేకర్లతో మాట్లాడారు. పునర్విభజన చట్టంలో 'ఎ కేపిటల్, ది కేపిటల్' అని మాత్రమే పేర్కొన్నారనీ, దీనిబట్టి ఏపీలో ఒక రాజధానికే అనుమతించిన విషయాన్ని గుర్తించాలని అన్నారు.
ఇప్పటికే తన అనుమతితో ఏర్పాటైన అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు విడుదల చేసిందనీ, కొన్ని వేల కోట్ల వ్యయంతో అక్కడ నిర్మాణాలు జరిగాయనీ అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను తెరపైకి తేవడం అమరావతి రైతులను మోసం చేయడమే అన్నారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడ న్యాయసమ్మతం కాదన్నారు. అమరావతి రైతులను వైసీపీ నేతలు హేళన చేయడం తగదన్నారు. తనపై కొన్ని పత్రికలు, చానెళ్లలో అభ్యంతరకరమైన భాషతో కథనాలను రాస్తూ, ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై కూడ అలాంటి భాషనే ఉపయోగిస్తూ కామెంట్లు చేయడం బాధాకరమని రఘురామ అన్నారు.
