గుంటూరు: రాజ్యాంగ సంక్షోభానికి సీఎం జగన్ ప్రభుత్వం తెరలేపుతోందని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. ''మీ వాదనలు విన్న తర్వాతే కదా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో నిబంధనలు ఉల్లంగించినప్పుడు.. ఉద్యోగ సంఘాలకు కరోనా గుర్తుకు రాలేదా. ఇప్పుడే ఉద్యోగుల ప్రాణాలు ప్రభుత్వానికి గుర్తొచ్చాయా?. ఉద్యోగ సంఘాల నాయకుడి వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి. చంపే హక్కు రాజ్యాంగం ఇచ్చిందంటూ వెంకట్రామిరెడ్డి అంటున్నారు. వీరి నిర్లక్ష్యంతో 3.65 లక్షల మంది ఓటు హక్కు కోల్పోతున్నారు'' అని పట్టాభి ఆవేదన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఎదురుచూస్తామని, అంతవరకు ఎన్నికలకు సహకరించేది లేదని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు.
ఉద్యోగులందరికీ వాక్సిన్ వేసిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎస్ఈసీ తమ విజ్ఞప్తిని పట్టించుకోలేదని విమర్శించారు. ఎస్ఈసికి ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు చెప్పిందని, అయితే పరిస్థితులు క్షేత్రస్థాయిలో భిన్నంగా ఉన్నాయని తెలిపారు. ఎస్ఈసి ఆదేశం అమలు చేయనందుకు కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని వెంకటరామిరెడ్డి గుర్తుచేశారు.

