ఆయుధాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది
40 శాతానికి ప్రైవేటు పరిశ్రమల భాగస్వామ్యం
రాఘవ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ప్రారంభోత్సవంలో డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): భారత రక్షణ తయారీ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతోందని డీఆర్డీవో మాజీ చైర్మన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు జి. సతీశ్రెడ్డి అన్నారు. రక్షణ రంగంలో ప్రైవేటు పరిశ్రమల భాగస్వామ్యం సుమారుగా 40 శాతానికి చేరిందని పేర్కొన్నారు. బుధవారం కోకాపేట్లో.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన రాఘవ ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఏడీపీఎల్) సంస్థను ప్రారంభించి ప్రసంగించారు. భారత్ ఆయుధాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని గుర్తుచేశారు. ఆర్మేనియా రిపబ్లిక్ డే పరేడ్లో మూడు భారతీయ ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించడం దేశ రక్షణ పరిశ్రమకు గర్వకారణమన్నారు. రాఘవ ఏరోస్పేస్ సంస్థ దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ ఎగుమతులపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. సతీశ్రెడ్డి సూచనలు తమ సంస్థ భవిష్యత్తుకు మార్గదర్శకమని ఆర్ఏడీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ లిఖిత్ రెడ్డి అన్నారు. స్వదేశీ సామర్థ్యాలను విస్తరించి రక్షణ రంగానికి అవసరమైన నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..

