Dailyhunt

రేపటి నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌, జనవరి 21(ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆదేశాల మేరకు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్‌ కౌన్సెలింగ్‌ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ గురువారం నోటిఫికేషన్‌ను జారీచేసింది. 23న ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు స్లాట్‌ బుకింగ్‌ ఉంటుంది. 24న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, 25వరకు ఆప్షన్ల ఎంపిక ఉంటుంది. 27న సీట్లను కేటాయిస్తామని, ఎంపికైనవారు ఈనెల 30లోపు కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలను ఈనెల 27న విడుదల చేస్తామని పేర్కొన్నారు. మొదటి, రెండోవిడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్నవారు సైతం పాత యూజర్‌ ఐడీతో ఆప్షన్లను ఎంచుకోవచ్చని తెలిపారు.

అనేక వర్సిటీల సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలకు ముందే కౌన్సెలింగ్‌ను పూర్తిచేయడంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పాల్గొనలేకపోయారు. దీనిపై న్యాయవాది యదీశ్వర్‌ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు మరోవిడత కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy