
కేరళ : పక్కన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు ఆరతీ రేఘునాథ్. కేరళకు చెందిన ఈమె.. లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించారు. ఒకటి కాదు, రెండు కాదు.. 350 కోర్సులను కేవలం 90 రోజుల్లోనే పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపర్చారు. వివరాల్లోకి వెళితే.. కొచ్చిలోని ఎలమక్కర ప్రాంతంలో ఆరతీ రేఘునాథ్ నివసిస్తున్నారు. ఎంఈఎస్ కళాశాలలో ఆమె ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. కాగా.. కరోనా నేపథ్యంలో మహమ్మారిని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ఆరతీ రేఘనాథ్.. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించారు.
అంతేకాకుండా తన ఆలోచనను కాలేజీ లెక్చరర్లతో పంచుకుని.. సూచనలు అడిగారు.
దీంతో వాళ్లు.. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీలు అందించే ఆన్లైన్ కోర్సుల గురించి ఆరతీ రేఘునాథ్కు వివరించారు. ఈ క్రమంలో జాన్ హాకిన్స్ యూనివర్సిటీ, టెక్నికల్ యూనివర్సిటీ డెన్మార్క్, వర్జీనియా యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ తదితర ప్రఖ్యాత యూనివర్సిటీలు అందించే 350 కోర్సులలో ఆమె అడ్మీషన్ తీసుకున్నారు. అంతేకాకుండా కేవలం 90 రోజుల్లోనే వాటిని పూర్తి చేశారు. దీంతో యూనివర్సల్ రికార్డ్స్ ఫోరంలో ఆమె స్థానం సంపాదించి.. ప్రపంచ రికార్డు సృష్టించారు. కాగా.. యూనివర్సల్ రికార్డ్స్ ఫోరంలో ఆరతి రేఘనాథ్.. ప్రపంచ రికార్డ్ సృష్టించడంపట్ల ఆమె తల్లిదంద్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. తాను చదివుతున్న కాలేజ్ ప్రిన్సిపల్, ఇతర స్టాఫ్ సహకారం వల్లే తక్కువ సమయంలో 350 కోర్సులు పూర్తి చేసినట్లు ఆరతి రేఘనాథ్ చెప్పారు.