ఇంటర్నెట్ డెస్క్: కాస్త రిస్క్ ఉన్నా సరే దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు వెళితే కళ్లు చెదిరే సంపదను సొంతం చేసుకోవచ్చంటూ ఓ నెటిజన్ నెట్టింట పెట్టిన పోస్టు వైరల్గా మారింది.
తన బంధువు తీసుకున్న రిస్క్ కారణంగా ఆయన జీవితంలో గొప్ప స్థితికి చేరుకున్నారని అన్నారు. రూ.20 లక్షల అప్పు చేస్తే అంతిమంగా రూ.3 కోట్ల సంపద సొంతమైందని చెప్పారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
పార్థ్ రస్తోగీ అనే వ్యక్తి ఈ పోస్టును షేర్ చేశారు. తనకు వరుసకు మామయ్య అయిన వ్యక్తి సుమారు 15 ఏళ్ల క్రితం మ్యూచువల్ ఫండ్స్పై రూ.20 లక్షల రుణం తీసుకున్నారని చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను టచ్ చేయవద్దని మిగతా బంధువులు, స్నేహితులు వారించినా కాస్త రిస్క్ తీసుకుని ముందడుగు వేశారని చెప్పారు. ఆ రుణంతో ఒక షాపును కొనుగోలు చేసి వ్యాపారంలోకి దిగారని అన్నారు.
మొదట్లో తాను తప్పు చేశానేమోనన్న భయం ఆయనకూ కలిగిందని అన్నారు. షాపు రెంటు నెలకు రూ.16 వేలు, రుణం ఈఎమ్ఐ రూ.23 వేలు, షాపు నిర్వహణకు సంబంధించి ఇతర ఖర్చులు పోను నెలనెలా రూ.7వేల నష్టం మిగిలేదని అన్నారు. కానీ 15 ఏళ్ల తరువాత పరిస్థితి ఊహించని విధంగా మారిపోయిందని చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్పై పెట్టిన రూ.50 లక్షల పెట్టుబడి విలువ రూ.3 కోట్లకు చేరగా ఆయన షాపు మార్కెట్ విలువ రూ.50 లక్షలకు పెరిగిందని అన్నారు. అప్పట్లో తీసుకున్న రుణాన్ని కూడా ఆయన తిరిగి చెల్లించారని అన్నారు. ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పక్కా వ్యూహం ఉంటే అంతిమంగా మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చని అన్నారు.

