కైకలూరు, జూలై 30(ఆంధ్రజ్యోతి): రోడ్డు కుదుపునకు ప్రాణం లేచొచ్చిన సంఘటన ఇది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నం మాజీ సర్పంచ్ గురజాల రామతులసి(48) రెండు రోజుల కిందట కిడ్నీ సంబంధిత వ్యాధితో అనారోగ్యానికి గురయ్యారు.
ఆమెను ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రెండు రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్న ఆమె.. మృతిచెందినట్లు వైద్యులు చెప్పడంతో గురువారం ఉదయం భుజబలపట్నం తీసుకువచ్చేందుకు ప్రైవేటు అంబులెన్సు ఏర్పాటు చేశారు.
అంబులెన్సులో ఆక్సిజన్, వెంటిలేటర్పైనే ఉంచారు. మార్గమధ్యలో మండవల్లి మండలం చింతపాడు గ్రామ సమీపంలో రహదారిపై ఉన్న చిన్నగోతిలో అంబులెన్సు కుదుపునకు గురయ్యింది. ఆ కుదుపుతో రామతులసి ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నట్లు గమనించిన బంధువులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఏలూరులోని మరో ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు విజయవాడ తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం ఆమె విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వార్తలు కూడా చదవండి...

