కర్నూలు(కలెక్టరేట్), ఏప్రిల్ 22: జిల్లాలో సెకండ్ వేవ్ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయని కలెక్టర్ వీర పాండియన్ అన్నారు. సమన్వయంతో పని చేస్తేనే కట్టడి సాధ్యమవుతుందన్నారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కొవిడ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కొవిడ్ ఫలితాలు 24 గంటల్లోగా ఇవ్వాలన్నారు. కొవిడ్ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బాధితులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రైవేటు హాస్పిటళ్లలో నిర్దేశిత ఫీజులు మాత్రమే తీసుకోవాలన్నారు. జీజీహెచ్లో ఫిర్యాదులకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి సూపరింటెండెంట్ డా.భగవాన్కు సూచించారు.
కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు టిడ్కో హౌసింగ్ కాలనీల కొవిడ్ కేర్ సెంటర్స్లో 4 వేల బెడ్స్కు పెంచాలని నోడల్ టీమ్కు ఆదేశించారు. కర్నూలు మెడికల్ కాలేజీలోని వీఆర్డీఎల్ కొవిడ్ టెస్టింగ్ ల్యాబ్స్లలో రోజూ 6 వేల పరీక్షలు జరగాలని, 24 గంటల్లోపు రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. రోగులకు రుచికరమైన భోజనంతో పాటు మనోధైర్యం కలగడానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్పీ ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్లు రాంసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డీఆర్వో పుల్లయ్య, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసులు, డీఎంహెచ్వో డా.రామగిడ్డయ్య పాల్గొన్నారు.