ఉత్తరాదికి సెల్యూట్ చేస్తే సిగ్గు అనిపిస్తుందా?
రాహుల్, సోనియా కాళ్లు మొక్కితే అనిపించడం లేదా?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు విమర్శలు
యాదాద్రి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వింటుంటే ఆయనవి దేశద్రోహ వ్యాఖ్యలని స్పష్టమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు చెప్పారు. యాదగిరిగుట్టలో జరుగుతున్న బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ పండిట్ దీన్దయాల్ అభియాన్ ప్రశిక్షణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఢిల్లీలో పాలన సాగిస్తున్న నేతలకు సెల్యూట్ చేయాలంటే సిగ్గనిపిస్తుందని రేవంత్ చెప్పడాన్ని ఆయన ఖండించారు. 60, 70సార్లు ఢిల్లీ వెళ్లి రాహుల్, సోనియా కాళ్లు మొక్కి కప్పం కట్టడం సిగ్గనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.
దక్షిణాది, ఉత్తరాది అనేవి దేశ వ్యతిరేకమాటలన్నారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించడం తగదన్నారు. జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్ టెక్స్టైల్స్, ములుగులో సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. ఎంఐఎంకు కొమ్ముకాసే కాంగ్రెస్, బీఆర్ఎస్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయలేవని రాంచందర్ రావ్ చెప్పారు.

