సామాన్య ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వెంటనే స్పందించే తెలుగు చిత్రసీమ మరోసారి ప్రజలకు తమ వంతు సాయాన్ని అందచేయడానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. సామాన్యులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రాణ నష్టంతో పాటు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి అండగా తామూ ఉన్నామంటూ టాలీవుడ్ సినీ పరిశ్రమ ముందుకొచ్చింది.
అందులో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్కు చిరంజీవి కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. మహేశ్బాబు కోటి రూపాయలను తన వంతు సాయంగా అందించటానికి ముందుకు వచ్చారు. నాగార్జున 50 లక్షలు, ఎన్టీఆర్ రూ.50 లక్షలను విరాళంగా ప్రకటించారు.
హీరో రామ్ రూ.25 లక్షల సాయాన్ని ప్రకటించారు. అలాగే హీరో విజయ్ దేవరకొండ పది లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్నానని తెలిపారు. హారిక హాసిని బ్యానర్తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ కలిసి తలో పది లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. డైరెక్టర్ అనీల్ రావిపూడి కూడా తన వంతు ఆర్థిక సాయంగా 5 లక్షల రూపాయలను అందించనున్నట్లు తెలిపారు. అలాగే డైరెక్టర్ హరీశ్ శంకర్ ఐదు లక్షల రూపాయలను, బండ్ల గణేష్ రూ.5లక్షల విరాళాన్ని అందిస్తున్నారు. వీరితో పాటు లక్ష్మీ మంచు వరద ముంపు ప్రాంతాల్లోకి వెళ్లి ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నారు.

