తెలంగాణ తాజావార్తలు
'సీతారామ'ను వేగంగా పూర్తి చేయండి!

అధికారులకు సీఎం ఆదేశం
పది లక్షల ఎకరాలకు సాగునీరు
అందించే ఈ ప్రాజెక్టు అత్యంత ముఖ్యమైనది..
ప్రగతి భవన్లో సీతారామ ప్రాజెక్టు
పనుల పురోగతిపై సీఎం సమీక్ష
హైదరాబాద్/ఖమ్మం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేేస సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కొత్త ఆయకట్టును సృష్టించడంతోపాటు సాగర్ ఆయకట్టును కూడా కలుపుకుని 10 లక్షల ఎకరాలకు నీరు అందించే ఈ ప్రాజెక్టును అత్యంత ముఖ్యమైనదిగా భావించాలని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఈఎన్సీలు మురళీధర్ రావు, హరేరామ్, సీఈలు వెంకట కృష్ణ, శంకర్ నాయక్, మధుసూదన్రావు, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, హరిప్రియ, సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ''అటు గోదావరి ఇటు కృష్ణా నదుల మధ్య ఉన్న ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం సీతారామ ఎత్తిపోతల పథకం మంజూరు చేసింది.
దుమ్ముగూడెం పాయింట్ వద్ద గోదావరి నదిలో ఏడాది పొడవునా పుష్కలమైన నీరు అందుబాటులో ఉంటుంది. ఈ నీటి ద్వారా ఖమ్మం జిల్లా యావత్తు నీరు అందించవచ్చు. దుమ్ముగూడెం నుంచి నీటిని ఎత్తిపోసి అటు ఇల్లందువైపు.. ఇటు సత్తుపల్లి వైపు, మరోపక్క పాలేరు రిజర్వాయర్కు లిఫ్టులు, కాల్వల ద్వారా నీటిని తరలించాలి. సత్తుపల్లి, ఇల్లందు వైపు వెళ్లే కాల్వలకు సంబంధించి మిగిలిన పనుల సర్వే వెంటనే పూర్తి చేసి, టెండర్లు పిలవాలి. మున్నేరు, ఆకేరు వాగులపై అక్విడెక్టులను నిర్మించి, పాలేరు రిజర్వాయర్ వరకు కాల్వల నిర్మాణాన్ని జూన్కల్లా పూర్తి చేయాలి. కృష్ణా నదిలో నీళ్లు ఎప్పుడుంటాయో, ఎప్పుడుండవో తెలియదు. అంతా అనిశ్చితి ఉంటుంది. కృష్ణా నది ద్వారా నీరు అందని సమయంలో గోదావరి నుంచి తెచ్చే నీటి ద్వారా సాగర్ ఆయకట్టుకు నీరందించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి''అని చెప్పారు.