పోలవరం, సెప్టెంబర్ 14: జిల్లాలోని చింతూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్కు చెందిన ఆరుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు విహారయాత్ర కోసం జిల్లాలోని సోకులేరు వాగుకు వెళ్లారు.
వారంతా వాగులో స్నానం చేస్తుండగా.. అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయారు. ఈ ప్రవాహంలో ఒకరు గల్లంతవ్వగా.. మిగిలినవారిని అటవీ అధికారులు రక్షించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసున్న ఆరుగురు స్నేహితులు విహారయాత్ర కోసం సోకులేరు వాగుకు వెళ్లారు. వారంతా కలిసి స్నానం చేయడానికి వాగులో దిగారు. అకస్మాత్తుగా వాగులో నీటి ప్రవాహం పెరిగింది. నీటి ఉధృతికి తట్టుకోలేక వారు వాగులో కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు.. అటవీ శాఖ ఉద్యోగులకు సమాచారం అందించారు. దీంతో అటవీ ఉద్యోగులు హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని, రక్షణ చర్యలు చేపట్టారు. ఆరుగురు స్నేహితులలో ఐదుగురిని వారు కాపాడగా, కోస్తూరి నీలేశ్ అనే యువకుడి ఆచూకీ లభించడంలేదు.

