అనంతపురం: సోలార్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం చేస్తున్న భూసేకరణ వెంటనే ఆపాలని జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం నూతిమడుగు పరిసర ప్రాంతంలోని రైతు భూములను సోలార్ ప్రాజెక్ట్ కోసం అన్యాయంగా లాక్కుంటూన్నారని రైతు సంఘం నాయకుడు కాటమయ్య విమర్శించారు. రెండు మండలాల్లోని ఐదు పంచాయతీల రైతులకు చెందిన దాదాపు తొమ్మిది వేల ఎకరాలను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయాలని ఈ ప్రభుత్వం చూస్తోందని ఆక్రోశించారు. రైతు అనుమతి లేకుండా భూములను తీసుకోకూడదని సుప్రీంకోర్టు చెప్పినా ఈ ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు. ఇంతకు ముందే ఫైరింగ్ రేంజ్ కోసం తీసుకున్న వేల భూములు నిరుపయోగంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
