Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తక్షణమే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి భూమిని స్వాధీనం చేసుకోండి.. రేవంత్ ఆదేశాలు

తక్షణమే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి భూమిని స్వాధీనం చేసుకోండి.. రేవంత్ ఆదేశాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 16: మాజీ సీఎం కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబంపై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలో ఉన్న కేసీఆర్ ఫాంహౌస్‌పై విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని.. విచారణ జరపకపోతే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 30 రోజుల్లో విచారణ నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌కు ఎస్సీలను యజమానులుగా చేస్తామని ప్రకటించారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌ ఆధీనంలో 700 ఎకరాలు ఉందని.. ఫాంహౌస్‌ భూమిని తేల్చాలని కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. 30 రోజుల్లోనే కేసీఆర్ ఫాంహౌస్‌ నుంచి భూమి స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామన్నారు. ఏ భూమినైతే శుద్ధి చేశారో అదే భూమికి ఎస్సీలను యజమానులను చేస్తామని ప్రకటించారు. కేసీఆర్‌కు తక్షణం నోటీసులు ఇచ్చి భూమి స్వాధీనం చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

సత్యం స్కాంలో ఉన్న భూముల్లోనే కేటీఆర్‌ ఫాంహౌస్‌ ఉందన్నారు. సత్యం స్కాంలో ఉన్న భూములు.. కేటీఆర్‌ బంధువుల పేరుతో బదిలీ అయ్యాయని చెప్పారు. సిద్దిపేట మున్సిపాలిటీ నిధులతో హరీశ్‌ రావు ఫాంహౌస్‌కు రోడ్లు వేయించినట్లు తెలిపారు. ఇరిగేషన్‌కు తీసుకున్న భూమిలోనే హరీశ్ రావు ఫాంహౌస్‌ ఉందన్నారు. హైదరాబాద్‌ బాలానగర్‌లో 120 ఎకరాలను హరీశ్ రావు కుటుంబ సభ్యులు కొల్లగొట్టారని ఆరోపించారు. ఫిర్యాదు చేయడానికి కూడా బాధితులు భయపడుతున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమం, ధరణిని అడ్డుపెట్టుకుని దోపిడీ చేశారని సీఎం ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబంలో ఎవరి పేరు మీద ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయనే వివరాలను అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు. కల్వకుంట్ల ఫ్యామిలీకి 440 ఎకరాల భూమి, కేసీఆర్‌ దంపతుల పేరిట 67 ఎకరాలు, కేటీఆర్‌ కుటుంబంలో నలుగురి పేరుతో 123 ఎకరాలు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే కేటీఆర్‌ పేరుపై 49.5 ఎకరాలు, శైలిమ పేరుపై 17.5 ఎకరాలు, అలేఖ్య పేరుపై 9.38 ఎకరాలు, హిమాన్షు పేరుమీద 46.3 ఎకరాలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా హరీశ్ రావు కుటుంబానికి 30 ఎకరాలు, కవిత కుటుంబానికి 37 ఎకరాలు, సంతోషరావు కుటుంబానికి 79 ఎకరాలు, నవీన్‌రావు పేరుపై 52 ఎకరాలు, కొండల్‌రావు పేరుపై 48 ఎకరాల భూమి ఉందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy