నిన్న ఎంఎస్ ధోనీ, నేడు విజయ్ సేతుపతి.. సోషల్ మీడియాకు బలయ్యారు. చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తె జీవాపై ఇటీవల ఓ యువకుడు సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి బెదిరింపులే తమిళ నటుడు విజయ్ సేతుపతికి కూడా ఎదురయ్యాయి.
శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800' నుంచి కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు సోమవారం ప్రకటించారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా చేశారు. అయితే ఇప్పటికీ సేతుపతిపై కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అతడిని కించపరుస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్ సేతుపతి కుమార్తెపై సోషల్ మీడయాలో అసభ్య కర కామెంట్స్ చేశాడు.
డీఎంకే ఎంపీలు కనిమొళి, ఎస్ సెంథిల్ కుమార్, సింగర్ చిన్మయి శ్రీపాద కూడా సోషల్ మీడియాలో స్పందించారు. 'మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాము. దీనిపై చర్యలు తీసుకోండి. అతడిని అరెస్ట్ చేయండి' అంటూ తమిళనాడు ప్రభుత్వం, చెన్నై పోలీసులను సోషల్ మీడియాలో కోరారు.

