విజయవాడ: తప్పుడు కేసులపై సుప్రీంకోర్టుకు వెళ్లామని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సమాచారాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా.. పంచుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా అరికట్టడం చేతగాక ప్రత్యర్థులపై సీఎం జగన్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమాపై కూడా అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై కూడా అనంతపురంలో తప్పుడు కేసులు బనయించారని అచ్చెన్న ధ్వజమెత్తారు.

