ఇంటర్నెట్ డెస్క్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): కేరళంలో పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్దేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ హయాంలో సీఎంలుగా పనిచేసిన కరుణాకరన్, ఊమెన్ చాందీలు కేరళంను ఎంతగానో అభివృద్ధి చేశారని ప్రస్తావించారు. ఈరోజు(మంగళవారం) కేరళంలోని కోవలం యూడీఎఫ్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కేరళంలో పంచాయతీరాజ్ వ్యవస్థ విజయం సాధించిందని.. దానిని తాము అభినందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎక్కడైనా మంచి జరిగితే తాము అభినందిస్తామని తెలిపారు. సీఎం పినరాయి విజయన్ హయాంలోని వైఫల్యాలను తాము ఎత్తి చూపామన్నారు. పినరాయి విజయన్ హయాం ముగిసిందని.. 120 నెలల విజయన్ పాలన కాలం వైఫల్యానికి ప్రతీకగా నిలిచిందని విమర్శించారు.
మేము గెలవబోతున్నాం..
పినరాయి విజయన్ వైదొలిగే సమయం ఆసన్నమైందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మూడింట రెండొంతుల మెజారిటీతో తాము గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కేరళంలో ఊమెన్చాందీ తరహా పాలన అందిస్తామని స్పష్టం చేశారు. కేరళంలో సరైన అవకాశాలు లేకపోవడంతో యువత ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారని చెప్పుకొచ్చారు. యువత వలస వెళ్లడంతో కేరళంలో వృద్ధులు... చిన్నపిల్లలే కనిపిస్తున్నారని ఇది దురదృష్టకరమని అన్నారు. విద్యావంతులు, నైపుణ్యం ఉన్న యువత విదేశాలకు వెళ్లడం సరికాదని.. వాళ్లు ఇక్కడకు వచ్చి ఉపాధి పొందేలా చేస్తామని తెలిపారు. తెలంగాణలో మాదిరే అభివృద్ధి.. మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ నియామకాలు... స్వీయ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం వంటివి కేరళంలో అమలు చేస్తామని మాటిచ్చారు.

