Dailyhunt
తెలంగాణ సర్కారుపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సర్కారుపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా లోటస్‌ పాండ్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో మహిళ ప్రాతినిధ్యం గురించి షర్మిల మాట్లాడారు. తెలంగాణ సమాజంలో మహిళల ప్రాతినిధ్యం ఎంతో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ గడ్డ రాజకీయ చైతన్యానికి అడ్డా అని, ఇక్కడి మహిళలు ఎవరికీ తక్కువ కాదని చెప్పారు. రాణి రుద్రమదేవి చరిత్ర అందరికీ తెలుసన్నారు. ఉద్యమాల్లో మహిళలది కీలక పాత్ర అని, కానీ ప్రస్తుత తెలంగాణ సమాజంలో స్త్రీల ప్రాతినిధ్యం ఎంత అని ప్రశ్నించారు. అసమానతలు గెలిచి సాధించుకున్న రాష్ట్రంలో అసమానతలు ఉన్నాయని షర్మిల ఆరోపించారు.

పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతోందని, ప్రత్యేక రాష్ట్రంలో మహిళలు ఘోరంగా అన్యాయమయ్యారని షర్మిల అభిప్రాయపడ్డారు. మహిళల విషయంలో అధికార పార్టీ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంతో మంది మహిళలు మంత్రి పదవులు అలంకరించారని, ప్రత్యేక రాష్ట్రంలో ఐదేళ్ల తర్వాత అది కూడా ఇద్దరికే అవకాశం ఇచ్చారని షర్మిల ఎద్దేవా చేశారు. మహిళలు అన్నింటిలోనూ సగం అయినప్పుడు ఇలాంటి అసమానతలు ఎందుకో పాలకులు చెప్పాలని డిమాండ్ చేశారు. చట్ట సభల దగ్గర నుంచి ఉద్యోగాల వరకు మహిళలకు అన్యాయం జరుగుతోందన్నారు. మహిళలకు అన్నింటా నిర్దిష్ట కోటా ఉండాల్సిందేనని షర్మిల స్పష్టం చేశారు. మహిళల హక్కుల కోసం తాను నిలబడతానని చెప్పారు. నేటి నుంచి తాను చేయబోయే ప్రతి పనిలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తానని చెల్లిగా, అక్కగా మాటిస్తున్నానని హామీ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy