హైదరాబాద్: తెలంగాణకు టీఆర్ఎస్, బీజేపీలు తీరని ద్రోహం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి 50 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ఐటీఐఆర్ను టీఆర్ఎస్ ఏర్పాటు చేయలేకపోతోందని ఆయన విమర్శించారు. తెలంగాణలోని భద్రాచలం రామమందిర్ భూముల బీజేపీ ఆంధ్రకు ఇచ్చి అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. బీజేపీ దేశానికి, రాష్ట్రానికి ఏమి చేయకపోగా డబ్బుల సంచులు పట్టుకొని కాంగ్రెస్ నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఈ గ్రాడ్యువట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు గట్టిగా బుద్ది చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
''సామాన్య ప్రజలు వంటగ్యాస్ వాడే పరిస్థితి లేకుండా ధరలు పెంచేశారు.
బీజేపీ ఘనకార్యం వల్ల ఎల్పీజీ గ్యాస్ మూడింతలు పెరిగి 850 రూపాయలు అయింది. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఈ స్థాయిలో పెంచడం దుర్మార్గమైన చర్య. పక్క రాష్ట్రాల్లో ఎల్పీజీ గ్యాస్పై సబ్సిడీ ఇస్తున్నట్లుగా కేసీఆర్ ఇక్కడ ఇవ్వడం లేదు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సామాన్య ప్రజల పక్షాన నిలబడి ధరల పెరుగుదలపై పోరాడుతుంది'' అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

