భారీ సినిమాలు, మెగా స్టార్స్, హైరేంజ్ డైరెక్టర్స్, బిగ్ ప్రొడక్షన్ హౌస్లు.. ఈ కాంబినేషన్లో వచ్చే చిత్రాలు డెడ్లీ కాంబినేషన్స్. అవి అటు అభిమానులని, ఇటు పరిశ్రమని, ఎగ్జిబిటర్స్కి కంటికి కునుకు లేకుండా చేస్తాయి. ఎప్పుడో సినిమా ఆర్నెల్ల తర్వాత రిలీజ్ అంటే ప్రాణాలన్నీ ఆ డేట్స్ మీదే ఉంటాయి. అభిమానుల తాపత్రయం వేరు. ఇండస్ట్రీ ప్రసవవేదన వేరు. కోటానుకోట్ల రూపాయలు ఇమిడిఉన్న భారీ చిత్రాల డేట్స్లో ఎక్కడైనా తేడా వచ్చిందంటే ఇంక ఆ నరకం వర్ణనాతీతం. థియేటర్లు, అగ్రిమెంట్లు, అడ్వాన్స్లు, మామ్మూలు తతంగం కాదు. చూడ్డానికి సినిమా థియేటర్లో అందంగా, అద్భుతంగా, ఆవేశపూరితంగా ఉంటుంది.. కానీ దానిని ప్రదర్శించేవారికి మాత్రం పురిటినొప్పులే.
త్వరలో విడుదల కానున్న, ఆల్రెడీ డేట్ ఎనౌన్స్ చేసిన సినిమాలు ట్రిపుల్ ఆర్, వకీల్సాబ్, సలార్, సర్కారువారి పాట, హరిహర వీరమల్లు.. ఈ సినిమాలున్నాయే.. తెలుగు సినిమా చరిత్రని 2021లో అట్నుంచిటు తిరగరాసే మ్యాజికల్ పిల్మ్స్! ఊరికే ఒక్కసారి ఊహించండి.. ఈ సినిమాలలో ఏ సినిమా డేట్ అయినా.. అంటే ఇప్పటికే ఎనౌన్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి.. ఇప్పడు తాజాగా మారిందంటే.. ఎంత గందరగోళం హోరెత్తిపోతుందంటే.. మాటల్లో చెప్పలేం.
'ట్రిపుల్ ఆర్' సినిమా డేట్ ఈ బ్యాచ్లో ముందుగా ప్రకటించారు. సలార్ చిత్రాన్ని సంక్రాంతికి పంపాలని నిర్మాతలు అనుకుంటున్నారని తెలిసి, ఆ క్షణమే 'హరిహర వీరమల్లు' రిలీజ్ టైం బాంబులా పేలింది. సలార్ నిర్మాతలు సెకండ్ ఆప్షన్గా వచ్చే సంవత్సరం ఏప్రిల్కి వెళ్ళిపోయారు. ఇంక ట్రిపుల్ ఆర్.. ఈ సినిమా మీదున్న అంచనాలకి ఆకాశం కూడా సరిపోదు. ఇద్దరు మైఠీ స్ఠార్స్.. ఇండియాలోనే టాపెస్ట్ డైరెక్టర్ రాజమౌళి చాలా టైం తీసుకుని, బాహుబలి తర్వాత కళ్ళు తిరిగే బడ్జెట్తో చేస్తున్న సినిమా. స్టోరీ చూస్తే.. అసలు భూమ్యాకాశాలు కలిసినట్టుగా.. అటు కొమరం భీమ్, ఇటు అల్లూరి సీతారామరాజు రెండు ధృవాలను కలిపినట్టుగా.. ఎవ్వరికీ అర్థం కాని రేంజ్లో వస్తున్న సినిమా. ఈ సినిమా ఇంకా కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. దాని తర్వాత రాజమౌళి మార్కు విఎఫెక్స్లు, గ్రాఫిక్స్. యానిమేషన్లు. ఏవో.ఏవేవో.. అంత తొందరగా ఒక పట్టాన అయ్యేవికావు. పైగా రాజమౌళి ఏమో.. అంత వీజీగా ఒప్పుకునే రకం కాదు. ఉడుం పట్టు పడతాడు. దానికి ఎంత టైం పడుతుందో ఇప్పటికిప్పుడు ఎవ్వరూ ఊహించలేరు. రాజమౌళినే అడిగినా ఆయన కూడా కన్ఫర్మ్ చేయలేడు. రాజీ లేని దర్శకమౌళి. రాజమౌళి. ఇక్కడే వచ్చింది చిక్కంతా. ఈ వ్యవహారం విజయదశమికి రెడీ అవుతుందంటే.. ఏమో డౌటే అంటున్నారు.
ఈలోగా 'ట్రిపుల్ ఆర్' నిర్మాత దానయ్య.. 'వీరమల్లు' నిర్మాత ఏఎం రత్నంకి ఫోన్ చేసి, రిలీజ్ డేట్ అడ్జస్ట్మెంట్ కోసం.. అంటే తన సినిమా సంక్రాంతికి వస్తే ఎలా ఉంటుంది అని సంప్రదింపులు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే దాదాపుగా విజయదశమికి ట్రిపుల్ ఆర్ ఉండకపోవచ్చు అన్నది మెల్లగా తేటతెల్లమవుతోంది. సర్కారువారి పాట, హరిహర వీరమల్లు ఒకదాని మీద ఒకటి పడుతున్నాయంటేనే అందరికీ గుండెలు దడదడలాడుతున్నాయి. ఇంక దానిమీద ట్రిపుల్ ఆర్ అంటే.. ధ్యేవుడా... అంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్స్వాళ్లు ఒప్పుకోగలరా? అప్పుడింక ట్రిపుల్ ఆర్కి రాజమౌళి తీసుకునే టైంకి సమ్మర్.. అంటే మే నెల ఒక్కటే శరణ్యం అన్నది గట్టిగా వినిపిస్తోంది.
ఇదే గనక జరిగితే.. మెగాస్టార్ చిరంజీవి చేయబోతోన్న లూసిఫర్ రీమేక్ విజయదశమికి తెచ్చేయాలని సదరు సినిమా నిర్మాతలు ఫిక్స్ అవుతున్నట్టు, అందుకు తగిన విధంగా లూసిఫర్ షూటింగ్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నట్టు గట్టిగానే అనుకుంటున్నారు పరిశ్రమలో. రీమేకే కాబట్టి తొందరగానే చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది మరి. ఈ గందరగోళానికి త్వరలోనే క్లారిటీ వస్తుందంటున్నారు. చూడాలి.. ఏం జరుగుతుందో!

