కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందే
సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడి
రైతు సంఘాల నేతలతో కమిటీ భేటీ
8 రాష్ట్రాల నుంచి పాల్గొన్న 10 సంఘాలు
అభిప్రాయాలు, సలహాలు స్వీకరించాం
వెల్లడించిన కమిటీ సభ్యులు
న్యూఢిల్లీ, జనవరి 21: కొత్త వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నర పాటు నిలిపివేస్తామని, సమస్యల పరిష్కారానికి సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. కేంద్రం ప్రతిపాదనపై గురువారం ఢిల్లీలో రైతు సంఘాల నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ''సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పూర్తిస్థాయి జనరల్ బాడీ సమావేశం జరిగింది.
మూడు చట్టాల అమలును తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 11న ఆదేశాలు జారీ చేయడంతో పాటు రైతు సంఘాలు, కేంద్రం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు నలుగురు నిపుణులతో కమిటీని నియమించింది. ప్రస్తుతం ఈ కమిటీలో ముగ్గురు సభ్యులే ఉన్నారు. భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు భూపీందర్సింగ్ మాన్ కమిటీ నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. గురువారం వేర్వేరు రైతు సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైనట్లు కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిసా, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 10 రైతు సంఘాలు ఈ భేటీలో పాల్గొన్నట్లు వెల్లడించారు. చర్చలో పాల్గొన్న ప్రతినిధులు తమ వాస్తవ అభిప్రాయాలను తెలిపారని, సాగు చట్టాల అమలులో మెరుగుపర్చాల్సిన అంశాలపై సలహాలు కూడా ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం కమిటీలో మహారాష్ట్రకు చెందిన షేట్కారీ సంఘటన అధ్యక్షుడు అనిల్ ఘన్వాత్, వ్యసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి, ప్రమోద్కుమార్ జోషి సభ్యులుగా ఉన్నారు.
ట్రాక్టర్ల ర్యాలీ వద్దు: కేంద్రం
గణతంత్ర దినోత్సవం నాడు రైతు సంఘాలు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీకి కేంద్రం అనుమతి నిరాకరించిం ది. అయితే తాము ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ నిర్వహించి తీరుతామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ''భద్రతా కారణాల రీత్యా 26న ఢిల్లీ ఔటర్రింగ్ రోడ్డుపై ర్యాలీ నిర్వహించరాదని ప్రభుత్వం చెప్పింది. మేం మాత్రం అక్కడే ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించాం. శుక్రవారం కేంద్రంతో చర్చల అనంతరం పోలీసులతోనూ సమావేశమవుతాం'' అని క్రాంతికారి కిసాన్ యూనియన్కు చెందిన దర్శన్ పాల్ తెలిపారు.

