అమరావతి: వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గంగవరం పోర్టులో ఉన్న ఏపీ వాటాను అమ్మేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పారు. మూడు రాజధానుల పేరుతో అమరావతి నిర్మాణాన్ని సైతం.. సీఎం జగన్ అర్ధాంతరంగా నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అమరావతిలో చేసిన అభివృద్ధి బూడిదలో పోసిన పన్నీరు చేశారన్నారు. విశాఖను కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లోకి నెడుతున్నారని ధ్వజమెత్తారు. ఉన్న పరిశ్రమలను మూసివేసే విధానాలను అవలంభిస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు.

