
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో వలస కార్మికులు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారని, వారి సొంత ప్రాంతాలకు వెళ్లలేక, కూలీకి వెళ్లిన చోట పని లేక రోడ్లపై బతుకుతున్నారని, వారి ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
కార్మికులకు ఇలాంటి దుర్గతి పట్టిచడం చాలా పెద్ద నేరమని, వారికి కనీస సహాయం, ఆదరణ కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని వలస కార్మికులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, అందుకోసం పటిష్టమైన నిర్ణయాలను త్వరితగతిన తీసుకోవాలని రాహుల్ డిమాండ్ చేశారు.
లేకుంటే ఇది మరింత పెద్ద సమస్యగా మారుతుందని, ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, వెంటనే వారికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

అంతేకాకుండా రాహుల్ తన ట్వీట్కు వలస కార్మికులకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా జత చేశారు. వాటిలో సరిహద్దుల వద్ద పోలీసులు నిలిపివేయడంతో రోడ్లపై కూర్చున్న వందల మంది కార్మికులున్నారు.