ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ
భూపాలపల్లిటౌన్, అక్టోబరు 20: ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ అన్నారు.
అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. ఈనెల 24న తలపెట్టిన మాదిగ ఉద్యోగుల 'చలో హైదరాబాద్' కార్యక్రమ సన్నాహక సమావేశం భూపాలపల్లిలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఏడేళ్లు గడిచినా అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. వర్గీకరణ విషయంలో 2007లో ఉషామెహ్రా కమిషన్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు ఆ కమిటీ నివేదికను తీసుకున్నాక కూడా తాత్సరం చేయడం దారుణ మన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరణను అమలు చేయాలని 2000 ఆగస్టు 27న ఐదుగురు జడ్జీల బెంచీ తీర్పు ఇచ్చినప్పటికీ నేటికీ అది నోచుకోవడం లేదని అన్నారు. ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఓనపాకల రాజయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హర్షం స్వామి, నాయకులు శంకర్, కే.శంకర్, శ్రీనివాస్, రాజేందర్, బిక్షపతి, రవీందర్, రమేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
