Dailyhunt
వేసవి సెలవులు ఉండవు...

వేసవి సెలవులు ఉండవు...

- ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ అశ్వత్థనారాయణ

బెంగళూరు: కరోనా కారణంగా ఉన్నత విద్యావిభాగంలో ప్రస్తుతం అమలవుతున్న పరీక్షలు, విద్యా విధానాలు కొనసాగుతాయని, వేసవి సెలవులు ఈ ఏడాది ఉండవని ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ అశ్వత్థనారాయణ స్పష్టం చేశారు. బెంగళూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ డిప్లమోతోపాటు ఉన్నత విద్యావిభాగానికి సంబంధించిన అన్ని పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. వీటిలో ఎటువంటి మార్పులు ఉండవన్నారు. 2021-22 విద్యాసంవత్సరంలో వ్యత్యాసం ఉండదన్నారు. పరీక్షలు ముగిశాక వేసవి సెలవులు ఉండవని, ఆ వెంటనే తరగతులు ప్రారంభం కానున్నాయన్నారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగుతాయన్నారు.

విద్యార్థులు రెండింటిలో వారికి అనుకూలమైన వాటిని ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనన్నారు. కొవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా సురక్షితమైన చర్యలు ఉంటాయన్నారు. గదుల శానిటైజేషన్‌, వ్యక్తిగత స్వచ్ఛత, కొవిడ్‌ నేపథ్యంలో పరీక్షల్లో మరిన్ని జాగ్రత్తలు, భౌతికదూరం, తప్పనిసరిగా మాస్కు ఉండాల్సిందేనన్నారు. కరోనా కారణంగా సమగ్ర శిక్షణ పర్యవేక్షణ విధానం అమలులో ఉంటుందన్నారు.

ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో చదివే 1.60 లక్షలమంది విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేశామన్నారు. గత ఏడాది 1.10 లక్షలమంది విద్యార్థులకు అందించామన్నారు. తరగతి గదులను స్టూడియోలుగా మార్చామని, అన్ని స్మార్ట్‌క్లాస్‌ కేంద్రాలుగా మారాయన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy