హుజూరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రికి వచ్చే రోగులు, విధులపై వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ హెచ్చరించారు.
మంగళవారం హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని అన్ని వార్డులను పరిశీలించారు. ఇన్వార్డ్, ఔట్వార్డ్లతోపాటు డ్రగ్ స్టోర్ను తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని కొన్ని విభాగాల పనితీరును చూసి అసంతృప్తిని వ్యక్తం చేశారు. చిన్న కేసుల చికిత్సను ఇక్కడే చేయాలని, అనవసరంగా వరంగల్కు రెఫర్ చేయవద్దన్నారు. రోగికి అత్యవసరమైతేనే ఆర్ఎంవో అనుమతితో పంపించాలన్నారు. అనవసరంగా స్కానింగ్ల కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించవద్దన్నారు. ఆస్పత్రిలో ప్రసవాలు తగ్గాయని, వీటిని పెంచాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజేందర్రెడ్డి, ఆర్ఎంవో సుధాకర్రావు, డాక్టర్ నారాయణరెడ్డిని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది రోగులతో మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్వో చందు, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్యామ్నాయక్ ఉన్నారు.
ఫ సైదాపూర్ పీహెచ్సీ తనిఖీ
సైదాపూర్: సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య కేంద్రంలోని రికార్డ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. సైదాపూర్ పాథమిక ఆరోగ్య కేంద్రంపై ఫిర్యాదులు వస్తున్నాయని, మీరు ఎమి చేస్తున్నారని సూపర్వైజర్లు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. ఇకపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు.

