Dailyhunt
విరాట్ సిక్సర్ల సంఖ్య 300 అధిగమించడం అద్భుతం: మహ్మద్ కైఫ్

విరాట్ సిక్సర్ల సంఖ్య 300 అధిగమించడం అద్భుతం: మహ్మద్ కైఫ్

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా క్రికెట్ దిగ్గజం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఏప్రిల్ 24న అన్ స్టాపబుల్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో 800 ఫోర్లు, 300 సిక్సర్లు బాదిన మొట్టమొదటి ప్లేయర్‌గా కింగ్ కోహ్లీ అవతరించాడు. 37 ఏళ్ల వయసులో కూడా తనలో ఏమాత్రం జోరు తగ్గలేదని నిరూపిస్తూ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో కోహ్లీపై మాజీ క్రికెటర్లు, కోచ్‌లు ప్రశంసిస్తున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిక్సర్లు కొట్టడం అనేది కోహ్లీ సహజ సిద్ధమైన స్వభావం కాదని, తన శైలిని మార్చుకుని ఈ మైలురాయిని అందుకున్నాడంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.

'ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ తన సిక్సర్ల సంఖ్యను 303కు చేర్చడం ఒక అద్భుతమైన ఘనత. సాధారణంగా కోహ్లీ సిక్సర్లు కొట్టే వాడు కాదు. కానీ అతను తన ఆటను మెరుగుపర్చుకున్నాడు. పరిస్థితులను తనకు అనుకూలంగా, తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ధైర్యం చూపుతాడు. అదే కోహ్లీ గొప్పతనం' అని ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. విరాట్ కోహ్లీ మొదట్లో ఎక్కువగా మైదానం అంతటా బంతులను పంపే ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.

ఐపీఎల్ ప్రారంభ రోజుల్లో కోహ్లీ బ్యాటింగ్ శైలి మైదానంలో ఖాళీలను వెతకడం, వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడం చేసేవాడు. అలానే అద్భుతమైన కవర్ డ్రైవ్‌లతో బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టేవాడు. అయితే, టీ20 ఫార్మాట్ బౌండరీల ఆటగా మారిన తర్వాత కోహ్లీ వెనుకబడిపోయాడు. దీంతో తన సహజ సిద్ధమైన ఆటతో పాటు బౌండరీలు బాదడం కూడా ప్రారంభించాడు. 303 సిక్సర్లు సాధించడం అతని అనుకూలతకు నిదర్శనం. 37 ఏళ్ల వయసులో కూడా కోహ్లీ బ్యాటింగ్ లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy