విజయవాడ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మావోయిస్టులు లేఖ రాశారు. దేశ సంపదను సామ్రాజ్యవాద కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికి కేంద్రం పూనుకుందని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ అన్నారు. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగం సంస్థలను, ప్రైవేటీకరణ చేయడాన్ని తెలంగాణా రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. అడవుల్లో ఉంటున్న ఆదివాసులను గెంటేయడానికి కుట్ర జరుగుతోందని చెప్పారు. అన్నం పెట్టే భారత రైతులను బిచ్చగాళ్లను చేయాలని కుట్ర జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న సామాజిక కార్యకర్తలు, హక్కుల నేతలు, మేధావులను అర్బన్ మావోయిస్టులనే పేరుతో జైల్లో పెట్టి గొంతును నొక్కేస్తున్నారని పేర్కొన్నారు.

