Dailyhunt
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మావోయిస్టుల లేఖ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మావోయిస్టుల లేఖ

విజయవాడ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మావోయిస్టులు లేఖ రాశారు. దేశ సంపదను సామ్రాజ్యవాద కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికి కేంద్రం పూనుకుందని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ అన్నారు. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగం సంస్థలను, ప్రైవేటీకరణ చేయడాన్ని తెలంగాణా రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. అడవుల్లో ఉంటున్న ఆదివాసులను గెంటేయడానికి కుట్ర జరుగుతోందని చెప్పారు. అన్నం పెట్టే భారత రైతులను బిచ్చగాళ్లను చేయాలని కుట్ర జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న సామాజిక కార్యకర్తలు, హక్కుల నేతలు, మేధావులను అర్బన్ మావోయిస్టులనే పేరుతో జైల్లో పెట్టి గొంతును నొక్కేస్తున్నారని పేర్కొన్నారు.

హక్కుల కోసం పోరాటం చేసే కార్మికులు, రైతులను దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారని చెప్పారు. విశాఖ ఉక్కు కార్మికులకు, ప్రజలకు మావోయిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు పలుకుతుందని వ్యాఖ్యానించారు. కార్మికుల ఉద్యమానికి తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy