అచ్యుతాపురం(విశాఖ జిల్లా), ఆగస్టు 4: విశాఖలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లోని కోనెక్స్ ఫార్మా కర్మాగారం వద్ద మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. కర్మాగారంలో రసాయన వ్యర్థాలను నిల్వచేసే ట్యాంక్ నిండిపోయి వెల్లువలా బయటకు వచ్చేసింది. దీనిని సిబ్బంది ఎవరూ గమనించలేదు. మెయిన్ గేటు పక్కనున్న కాలువ వరకు ప్రవహించాక.. అక్కడ ఒక్కసారిగా మంటలు రాజుకున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు, చుట్టుపక్కల గల కర్మాగారాల్లో పనిచేస్తున్న సిబ్బంది పరుగులు తీశారు. సెక్యూరిటీ సిబ్బంది, కంపెనీ ఉద్యోగులు అప్రమత్తమై.. అందుబాటులో ఉన్న ఫోమ్ను వినియోగించి మంటలను అదుపుచేశారు.
రసాయన వ్యర్థాలు నిల్వచేసిన ట్యాంకుకు మంటలు చేరకుండా నిలువరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని కార్మికులు తెలిపారు. ''

