విశాఖపట్నం, ఆగస్టు 12: జీవీఎంసీ పరిధిలోని ప్రజలకు తాగునీరు సరఫరా చేసే టౌన్ సర్వీస్ రిజర్వాయర్ను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఈరోజు(బుధవారం) సందర్శించారు.
నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ తెలిపారు. ముడసర్లోవ రిజర్వాయర్తోపాటు ఇతర రిజర్వాయర్లలో నీటి శాతం తగ్గిందన్నారు. ఈ క్రమంలో ఏలేరు కాలువ ద్వారా నగరానికి నీటి సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.
ఆరిలోవ, కేఆర్ఎం కాలనీ, పోతిన మల్లయ్యపాలెం సహా ఆరు ప్రాంతాల్లో నీటి సమస్య అధికంగా ఉందని కమిషనర్ అన్నారు. గత రెండు రోజులుగా ఆయా ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నీటి సరఫరా సమయాన్ని అరగంట నుంచి 45 నిమిషాలకు పెంచినట్లు చెప్పారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాలకు ఉచిత నీటి ట్యాంకర్లను కూడా సరఫరా చేస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు.

