హోమ్
న్యూజీలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బృందంలో ఆరుగురికి కరోనా పాజిటివ్

న్యూజీలాండ్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బృందంలో ఆరుగురు సభ్యులకు కోవిడ్-19 సోకినట్లు నిర్ధరణ అయ్యింది.
ఆ ఆరుగురినీ ప్రస్తుతం ఐసోలేషన్లో ఉంచారు. మరోవైపు ట్రైనింగ్లో భాగంగా వారికి ఇచ్చిన సామాజిక దూరం మినహాయింపులనూ రద్దు చేశారు.
తమ దేశంలోకి అడుగుపెట్టిన వెంటనే పాకిస్తాన్ బృందంలోని 53 మందికీ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించామని న్యూజీలాండ్ అధికారులు తెలిపారు.
కరోనావైరస్ కట్టడికి న్యూజీలాండ్ తీసుకున్న చర్యలపై ప్రపంచ దేశాలు ప్రశంసల వర్షం కురిపించాయి. ఇక్కడ కేవలం 2,040 కేసులు నమోదు కాగా, 25 మరణాలు సంభవించాయి.
మహమ్మారి వ్యాప్తి మొదట్లోనే ఇక్కడ కఠినమైన లాక్డౌన్ను అమలు చేశారు. పక్కాగా పరీక్షలు చేస్తూ, మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేశారు. చివరగా ఇక్కడ నవంబరు 18న ఒక కేసు నమోదైంది.
మరోవైపు పాకిస్తాన్లో 3.5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 7,843 మరణాలు సంభవించాయి.
ప్రస్తుతం కరోనావైరస్ నిర్ధరణ అయినట్లు తేలిన ఆరుగురిలో నలుగురికి తాజాగా వైరస్ సోకిటన్లు న్యూజీలాండ్ క్రికెట్ అధికారులు వెల్లడించారు. మొదటిరోజు ఆ బృందం మొత్తాన్నీ క్రైస్ట్చర్చ్లో ఐసోలేషన్లో పెట్టామని, కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తే, హెచ్చరించామని న్యూజీలాండ్ క్రికెట్ (ఎన్జెడ్సీ) తెలిపింది.
పాక్ బృందం నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపిస్తోందని స్టఫ్.కో.ఎన్జెడ్ వెబ్సైట్తో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
అయితే, లాహార్ నుంచి బయలుదేరేటప్పుడు పాక్ జట్టుకు నాలుగుసార్లు కోవిడ్-19 టెస్టులు చేశారు. వీరందరికీ నెగిటివ్ అని వచ్చింది.
ఐసోలేషన్ నిబంధనలను ఉల్లంఘించిన వెస్ట్ఇండీస్ క్రికెట్ జట్టుపై కూడా ఈ నెల మొదట్లో న్యూజీలాండ్ చర్యలు తీసుకుంది.
రెండు టెస్టు మ్యాచ్లు, మూడు టీ-20 మ్యాచ్లు ఆడేందుకు పాక్ జట్టు ఇక్కడికి వచ్చింది.
source: bbc.com/telugu