Dailyhunt
33 ఏళ్ల నాటి దావూద్ కుట్ర.. ఆయుధాల స్మగ్లింగ్ కేసులో 12 మందికి శిక్ష!

33 ఏళ్ల నాటి దావూద్ కుట్ర.. ఆయుధాల స్మగ్లింగ్ కేసులో 12 మందికి శిక్ష!

Big TV Live 2 weeks ago

Jamnagar TADA court verdict: దేశంలో 1993 ఆయుధాల అక్రమ రవాణా కేసులో గుజరాత్‌లోని జామ్‌నగర్ ప్రత్యేక టాడా (TADA) కోర్టు సోమవారం చారిత్రక తీర్పు వెలువరించింది.

అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన సూత్రధారిగా సాగిన ఈ భారీ కుట్రలో పాలుపంచుకున్న 12 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ప్రత్యేక న్యాయమూర్తి ఆర్.పి. మొగేరా వీరికి కఠిన కారాగార శిక్షలు విధిస్తూ తీర్పు చెప్పారు. దోషులలో 10 మందికి ఐదేళ్ల కఠిన శిక్ష.. మరో ఇద్దరికి ఏడేళ్ల కఠిన శిక్షను ఖరారు చేశారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మరో 17 మందిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.

డిసెంబర్ 6, 1992న అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా దేశంలో విధ్వంసం సృష్టించాలని దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్, అనీస్ ఇబ్రహీం దుబాయ్ వేదికగా కుట్ర పన్నారు. పాకిస్థాన్ సహాయంతో పెద్ద ఎత్తున ఆర్డీఎక్స్ (RDX).. సుమారు 150 రకాల ఆయుధాలు.. హ్యాండ్ గ్రెనేడ్లు.. బాంబులు.. రైఫిళ్లను భారత్‌లోకి సముద్ర మార్గంలో తరలించాలని వీరు ప్లాన్ చేశారు. దీనికోసం జామ్‌నగర్ సమీపంలోని బేడీ.. కచ్ ప్రాంతంలోని సలాయ-మాండ్వి గ్రామాలకు చెందిన స్థానికులను అక్రమ రవాణా కోసం వినియోగించుకున్నారు.

దుబాయ్ నుంచి పాకిస్థాన్‌కు చెందిన సదా అల్ బహార్ అనే లాంచ్‌ను కరాచీ సమీపానికి తీసుకెళ్లారు. అక్కడ పాకిస్థాన్ మెరైన్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన నౌక నుంచి ఆయుధాలను స్వీకరించారు. సుమారు 48 గంటల పాటు నడిసముద్రంలో వేచి చూశారు. ఆ తర్వాత.. బిస్మిల్లా, మార్వాన్ అనే మరో రెండు లాంచ్‌లకు సగం ఆయుధాలను బదిలీ చేశారు. బిస్మిల్లా మహారాష్ట్ర వైపు వెళ్లగా.. సదా అల్ బహార్ గుజరాత్ తీరం వైపు వెళ్లింది. శాటిలైట్ ఫోన్ల ద్వారా సిగ్నల్స్ అందిన తర్వాత.. పోర్బందర్ సమీపంలోని గోసాబారా గ్రామం వద్ద ఆయుధాలను దింపారు. అక్కడి నుంచి ట్రక్కుల ద్వారా గుజరాత్‌లోని సూరత్.. వల్సాడ్ సహా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఈ ఆయుధాలను తరలించారు.

జూలై 1993లో జామ్‌నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. ఈ కేసు దర్యాప్తు ఏకంగా 2018 వరకు అంటే పాతికేళ్ల పాటు సాగింది. మొత్తం 46 మందిని అరెస్ట్ చేయగా.. దావూద్ ఇబ్రహీం సహా 15 మందిని పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. విచారణ కాలంలో 11 మంది నిందితులు మరణించారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ మనోజ్ శశిధర్.. రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు పి.కె. ఝా.. సతీష్ వర్మ ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్ సైనిక అధికారులు.. మెరైన్ సెక్యూరిటీ అధికారుల ప్రమేయాన్ని ప్రాసిక్యూషన్ కోర్టులో నిరూపించగలిగింది. 33 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live