పీసీసీ చీఫ్గా మహేశ్కుమార్ గౌడ్కు వచ్చిన అవకాశం ఓ అదృష్టమేనని చెప్పాలి. ఎంతో మంది సీనియర్లు దీనికి పోటీలు పడినా.. రేవంత్ ఆశీస్సులు కూడా తోడు కాగా..
మహేశ్కు తెలంగాణ రాష్ట్ర పగ్గాలు చేపట్టే అవకాశం దక్కింది. మధుయాష్కీ గౌడ్కు కూడా అధిష్టానం ఆశీస్సులు ఉండే. ఏఐసీసీ వర్గాలతో మంచి సంబంధాలు కొనసాగించిన నేత…ఇతను కూడా చివరి వరకు పోరాడాడు. కేవలం సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో మహేశ్కే ఈ పీఠం దక్కింది. కానీ కుండపలిగితే పలిగింది కానీ.. కుక్క బుద్ది తెలిసింది.. అన్నట్టుగా పీసీసీ చీఫ్గా అవకాశం వచ్చిన తరువాత తన మార్కు కోసం మహేశ్ మొదట బాగానే ప్రయత్నం చేశాడు.
కానీ అది కాలక్రమేణా తగ్గింది. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్టుగానే ఆయన పార్టీ క్యాడర్లకు లీడర్లకు దొరకుండా పోతున్నారు. పెద్ద పదవి, ఆయన అధిష్టానం పట్ల చూపుతున్న విధేయతకు, సీనియారిటీకి పట్టం గట్టారు. కానీ తనదైన మార్కును సొంతం చేసుకోలేకపోయారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. నిజామాబాద్లో ఆయనకు మూడు సార్లు నిజామాబాద్ లోకల్ టికట్ అర్బన్ నియోజకవర్గం నుంచి అవకాశం ఇచ్చింది. కానీ ఓడిపోయాడు. అక్కడ ఆయనకు పట్టులేదు. తన అనుచర గణమూ లేదు. రాష్ట్ర పగ్గాలే చేతికొచ్చిన తరువాత.. మహేశ్ తన దైన మార్కును చూపడంలో ఘోరంగా విఫలమయ్యారు.
పార్టీ పదవులు భర్తీ చేయడానికే ఆయన చాలా సమయం తీసుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ను ఎదుర్కొంటున్నట్టుగా అనిపిస్తుంది. తన పదవిని కాపాడుకునే క్రమంలో ఢిల్లీ పెద్దల ఆశీస్సులు పొందేందుకు పడే తపనలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు మాత్రం అంతగా శ్రద్ద చూపలేదు. ఆయనను కలవాలంటే సీనియర్లకు కూడా చాన్స్ లేదు. ఒక పీఏ నుంచి సరైన రెస్పాన్స్ ఉండదు. పీఆర్వో వ్యవస్థ అస్తవ్యస్తం. మీడియాతో సంబంధాలు అంతంత మాత్రమే. పార్టీలకతీతంగా ఏ ఒక్కరిని కదిలించినా మహేశ్ పట్ల సానుభూతి మాత్రం కనిపించదు. వినిపించదు. రెండేళ్లైనా పార్టీ మీద తన ముద్ర వేసుకోవడంలో మహేశ్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు.
ఆదిలో మంత్రులతో ముఖాముఖి అన్నాడు. అది ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. జిల్లాల పర్యటన లేదు. క్యాడర్ను పట్టించుకోవడం లేదు. సిన్సియర్ గా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పదవులు ఇప్పించే విషయంలో కూడా మహేశ్ ఫెయిలయ్యాడు. ఇంకా దీంట్లో వారు ఎవరి గ్రూపు .. అని తరచి చూసుకునే కాంగ్రెస్ సంప్రదాయాన్ని ఈయన కూడా కొనసాగించడంతో చాలా శాతం పదవులు పెండింగ్లోనే ఉన్నాయి. జిల్లాల పర్యటన లేకపోవడం, ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను, విమర్శలను తిప్పికొట్టడంలో గాంధీభవన్ వర్గాలు ఘోరంగా విఫలమయ్యాయనే చెప్పాలి.
మహేశ్ పరిస్థితి అంతకు ముందు దారుణంగా ఉండేదది. కనీసం ఇంటి కిరాయి కూడా కట్టుకునే స్థితిలో లేడు. అలాంటి పరిస్థితి నుంచి రేవంత్ ఆశీస్సుల, అండతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. తన జీవితం డౌట్ టు ఎర్త్ అనే ముచ్చట మరిచాడు. మూలాలు విస్మరించాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకున్నాడే తప్ప.. పార్టీని పటిష్టం చేసి ప్రజల్లోకి పథకాలు తీసుకెళ్లి.. మరోసారిఅధికారంలోకి తీసుకుచ్చే క్రమంలో ఎలాంటి ముందుగా చర్యలు చేపట్టలేదు. అందుకే అంది వచ్చిన అదృష్టాన్నిఆయనే చేజేతులా కాలరాసుకున్నాడు. ఇలా చేయడానికి ఆయనకు అధికార దర్పం తోడు కాగా.. తన సహజ సిద్దమైన వ్యక్తిత్తమూ నష్టం కలిగించింది. అయినా ఇప్పుడాయాన పరివర్తన చెందిన నేతగా కనిపించకపోవడం.. పార్టీకి మరింత ప్రమాదకరం, నష్టదాయకమనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు.

