Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అందుకే రాజకీయాలకు దూరంగా ఉన్నా..! జనాలకు చెప్పేదొకటి.ఇక్కడ జరిగేదొకటి!

అందుకే రాజకీయాలకు దూరంగా ఉన్నా..! జనాలకు చెప్పేదొకటి.ఇక్కడ జరిగేదొకటి!

Big TV Live 3 weeks ago

మండవ వెంకటేశ్వరరావు.. సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి. ఎన్టీఆర్‌, చంద్రబాబు ప్రభుత్వాల్లో కీలక పదవుల్లో రాణించినవారు. ఆయన కొన్నేండ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

తనకు తానుగా రాజకీయంగా రిటైర్‌మెంట్ ప్రకటించుకున్నారు. ఏ పార్టీలో తను ఇప్పుడు కొనసాగడం లేదని చెబుతున్నారు. కానీ బీఆరెస్.. ఆయన మా పార్టీలో ఉన్నారని చెప్పుకుంటారు. లేదు.. లేదు మా పార్టీ నేత అని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. కానీ ఆయనకు ఈ రెండు పార్టీలంటే కూడా గిట్టడం లేదు. నచ్చడం లేదు. అసలిప్పుడున్న ఈ రాజకీయాలంటే ఏవగింపు, విరక్తి కలుగుతుందంటున్నారాయన. చాలా రోజుల తరువాత అమీర్‌పేట్‌లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు సందర్భంగా ఆయన పాల్గొన్నారు. మాట్లాడారు.

బిగ్‌టీవీ వెబ్‌సైట్‌లో కూడా ఆయన గురించి ప్రత్యేక కథనం వచ్చింది. అదే కంచుకంఠం. ఆ మాటల్లో నిజాయితీ. నిండైన వ్యక్తిత్వం. ఉన్న విషయాలను ముక్కు సూటిగా చెప్పే తత్వం. అందుకే కాబోలు ఆ రాజకీయాలకు సూట్ కాలేకపోయారు.. అని అంతా అనుకుంటారు. ఆయన నోటి వెంట కూడా ఈ మాటే వచ్చింది. బిగ్ టీవీ వెబ్‌సైట్ ప్రతినిధికి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. తను ఇప్పుడు ఏ పార్టీలోనూ లేనని స్పష్టం చేశారు. అప్పుడు బీఆరెస్‌లో చేరింది కూడా తన ఇష్టంతో కాదన్నారాయన. తన ఇంటికి కేసీఆర్ స్వయంగా వచ్చి బలవంతంగా పార్టీలోకి ఆహ్వానించారని, అన్యమనస్కంగానే ఆ పార్టీలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నానని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

ఆ తరువాత తను ఆ పార్టీతో ఏ మాత్రం టచ్‌లో లేనని చెప్పిన మండవ.. ఆ తరువాత కాంగ్రెస్ విషయంలోనూ అదే జరిగిందన్నారు. ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలు తనలాంటి వారికి అసలే సెట్ కావన్నారు. ఎన్నికల సమయాల్లో ప్రజలకిచ్చిన హామీలు వేరు.. అధికారంలోకి వచ్చిన తరువాత జనానికి చేస్తున్నది వేరుగా ఉందని ఆయన స్ఫష్టం చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీల కోసం అప్పులు ఎడాపెడా చేసేశారని, ఆ అప్పులు తీర్చేందుకు రేవంత్ అప్పులు చేస్తున్నాడన్నారు. ఈయన అప్పులు తీర్చేందుకే ఆయన అప్పులు చేస్తే.. మరి జనానికిచ్చిన హామీలు నెరవేర్చేదెన్నడని మండవ ప్రశ్నించారు. అంటే… జనం ముందుకు పోయి మనం చెప్పిన మాటలు.. ఆచరణలో అమలు కాలేవని తేలిపోతున్నదని, మరలాంటి రాజకీయాలు నాకు అవసరమా? అని ఆయన అన్నారు.

ఉన్నది ఉన్నట్టు చెప్పడం, జనానికి ఏం చేస్తామని చెప్పామో.. అది చేసి చూపడం రాజకీయ నాయకుడిగా సంతృప్తినిచ్చే విషయం. అప్పటి రాజకీయాలు అలా ఉన్నాయి కాబట్టే అంత కాలం మనగలిగానని చెప్పుకొచ్చిన ఆయన.. ఇప్పటి రాజకీయాలు నాలాంటి వాడికి అసలే సెట్‌ కావని, అందుకే తాను ఏ రాజకీయ పార్టీతో కూడా లేనని అన్నారు. తనకు పదవుల మీద ఆశ, ధ్యాసలేదన్నారు. చాలా మంది తనను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని బలవంతం చేశారని, తన శ్రేయోభిలాషులు కొందరు ఎంత బలవంతం చేసినా తన మనస్సు దానికి ఒప్పుకోలేదన్నారాయన. తనకు ఆయా పార్టీలు మంచి గుర్తింపునే ఇచ్చాయని, కానీ ఏ పార్టీతో కూడా తను ఇక కొనసాగలేనని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live