Farmers Protest: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని, కొనుగోలు కేంద్రాల్లో అనేక రోజులుగా ఎదురుచూస్తున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణలో పెడుతున్న నిబంధనలు తమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని మండిపడుతూ.. పూడూర్ వద్ద కరీంనగర్ – జగిత్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.
ఈ ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు కూడా మద్దతు పలికారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఈ ధర్నాలో రైతులతో కలిసి కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వానాకాలం పంట చేతికొచ్చి వారాలు గడుస్తున్నా, ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయకపోవడం దారుణమని విమర్శించారు. నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా, తక్షణమే ప్రతి గింజను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
రైతుల రాస్తారోకోతో కరీంనగర్ – జగిత్యాల మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డప్పటికీ, అన్నదాతల గోడు వినేవారే లేరని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని రైతులు భీష్మించుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు, అధికారులు రంగ ప్రవేశం చేసి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

