Mamata Banerjee is beaten inside booth: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత కంచుకోట అయిన భవానీపూర్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు.
బీజేపీ సీనియర్ నేత.. ప్రతిపక్ష నేత సువేందు అధికారి సుమారు 15,105 ఓట్ల భారీ మెజార్టీతో ఆమెపై చారిత్రాత్మక విజయం సాధించారు. గతంలో నందిగ్రామ్లోనూ మమతను ఓడించిన సువేందు.. ఇప్పుడు భవానీపూర్లోనూ ‘జెయింట్ కిల్లర్’గా నిలిచి ఆమె రాజకీయ ప్రస్థానానికి పెద్ద షాక్ ఇచ్చారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలోకి రావడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ లోపల తనపై దాడి జరిగిందని, తనను కొట్టారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఫలితాలను తాను అంగీకరించబోనని.. ఇది నైతిక విజయం కాదని ఆమె తెగేసి చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని.. బీజేపీ వందకు పైగా స్థానాలను దౌర్జన్యంగా దోచుకుందని ఆమె ఆరోపణలు చేశారు.
“దీనిని మీరు విజయమని భావిస్తున్నారా? ఇది అనైతిక విజయం. ఎన్నికల సంఘం ఇప్పుడు బీజేపీ కమిషన్లా మారిపోయింది. ఇదంతా లూటీ.. లూటీ.. లూటీ మాత్రమే! మేము మళ్లీ పుంజుకుంటాం.. పోరాటం ఆపం” అని మమత వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని.. మనోజ్ అగర్వాల్ వంటి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు మమతా బెనర్జీ సొంత నియోజకవర్గమైన భవానిపూర్లో పరిస్థితి అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. తన మాజీ సహచరుడు.. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆమెపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇంకా మూడు రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉండగానే.. సువేందు 6,226 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

