West Bengal News: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ముదిరింది. కోల్కతాలోని లోక్ భవన్కు చేరుకున్న పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) మనోజ్ కుమార్ అగర్వాల్ గవర్నర్ ఆర్.ఎన్.
రవి తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు.. ఎన్నికల ఫలితాల గెజిట్ విడుదలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. బెంగాల్ అసెంబ్లీ గడువు రేపటితో ముగియనుండటంతో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారుతున్నాయి.
ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ మమతా బెనర్జీ రాజీనామా చేయడానికి ససేమిరా అనడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్కు ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి ఆమెను పదవి నుంచి తొలగించేందుకు గవర్నర్ సిద్ధమవుతున్నారు. ప్రజల తీర్పును గౌరవించకుండా పీఠంపై కొనసాగడం చెల్లదని.. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వంపై వేటు వేసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేయనున్నారు.
మరోవైపు బెంగాల్లో తొలిసారి అధికారాన్ని దక్కించుకున్న బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తును ముమ్మరం చేసింది. మే 8వ తేదీన పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కేంద్ర పరిశీలకుడిగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ భేటీలో బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకుని.. అందరి ఆమోదంతో అధికారికంగా బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి పేరును అమిత్ షా ప్రకటించనున్నారు. సువేందు అధికారి పేరు ముఖ్యమంత్రి రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది.
బెంగాల్ గడ్డపై తొలి కమల వికాసం జరుగుతుండటంతో మే 9న జరగబోయే సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి ఎన్డీఏ (NDA) పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. కేంద్ర మంత్రులు.. పలువురు జాతీయ స్థాయి ప్రముఖులు హాజరుకానున్నారు. దీదీ కోటను బద్ధలు కొట్టి అధికారాన్ని దక్కించుకున్న నేపథ్యంలో కోల్కతాలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

