పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. గత పదేళ్లుగా తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోటను భారతీయ జనతా పార్టీ బద్ధలు కొట్టింది.
హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరులో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గద్దె దించడమే లక్ష్యంగా సాగిన బీజేపీ వ్యూహాలు పక్కాగా ఫలించాయి. టీఎంసీకి ఊహించని పరాభవం ఎదురుకాగా.. బెంగాల్ గడ్డపై మొదటిసారి కమల వికాసం జరగడం ఖాయమైంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి బెంగాల్ ప్రజలు మార్పు కోరుకున్నారని స్పష్టంగా అర్థమవుతోంది.
సీఎం కుర్చీపై ఉత్కంఠ
బెంగాల్లో విజయం ఖాయం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై మళ్లింది. బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రి అమిత్ షా ద్వయం ఎవరూ ఊహించని వ్యక్తిని సీఎం పీఠంపై కూర్చోబెట్టనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి కొత్త ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. బెంగాల్ సంస్కృతిని.. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ ఎంపిక ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బెంగాల్ విజయం చారిత్రాత్మకం
బెంగాల్ విజయపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హర్షం వ్యక్తం చేశారు. ఇదొక చారిత్రాత్మక విజయమని ఆయన అభివర్ణించారు. బెంగాల్లో పార్టీ గెలుపు కోసం ఎంతోమంది నాయకులు కష్టపడ్డారని.. ఎంతోమంది కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని గుర్తు చేసుకున్నారు. హింసాత్మక రాజకీయాలను ఎదుర్కొని సాధించిన ఈ గెలుపు ప్రజాస్వామ్య విజయం అని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ప్రతి చోటా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలోనూ కమల వికాసం..
బెంగాల్ ఫలితాలు దక్షిణ భారతదేశంపై ముఖ్యంగా తెలంగాణపై గట్టి ప్రభావం చూపుతాయని రామచంద్రరావు విశ్లేషించారు. పశ్చిమ బెంగాల్ తరహాలోనే రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ విజయదుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి.. కుటుంబ పాలనతో విసిగిపోయిన ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. బెంగాల్ ఫలితం తెలంగాణలో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. బెంగాల్లో మమత పతనం.. దేశవ్యాప్తంగా బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందనే సంకేతాలను పంపింది.
తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు.. కొడుకు విక్టరీపై విజయ్ తండ్రి రియాక్ట్, చారిత్రాత్మక విజయమంటూ..

