TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. మాజీ సీఎం మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పార్టీలో చోటుచేసుకున్న చీలిక మరో అంకానికి చేరుకుంది.
తిరుగుబాటు నేత రితబ్రతా బెనర్జీని ప్రతిపక్ష నేతగా గుర్తిస్తున్నట్లు ఆ రాష్ట్ర స్పీకర్ రతీంద్ర బోస్ ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షానికి కేటాయించిన గది తాళాలలను సైతం ఆయనకే అప్పగించారు. మరోవైపు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన కోలకత్తా మేయర్ ఫిర్హాద్ హకీం సైతం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం.. టీఎంసీ ఏ స్థాయిలో సంక్షోభం ఉందో తెలియజేస్తోంది.
బెంగాల్ ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి మాజీ సీఎం మమతాకు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఓవైపు ఘోర ఓటమి, టీఎంసీ కార్యకర్తలపై దాడులతో అల్లాడుతున్న మమతకు.. మరోవైపు సొంత పార్టీ నేతలే గట్టి షాకిచ్చారు. ఏకంగా 58 మంది ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా రితబ్రతా బెనర్జీ పేరును పేర్కొంటూ స్పీకర్ కు లేఖ రాశారు. ఇవాళ ఉదయమే ప్రత్యేక బస్సులో వారంతా అసెంబ్లీకి వెళ్లి.. స్పీకర్ కు లేఖను అందజేశారు. మెుత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలకు గాను.. ఏకంగా 58 మంది రితబ్రతా బెనర్జీ పక్షాన నిలబడటంతో ఆయన్నే ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఇటీవలే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో రితబ్రతా బెనర్జీని టీఎంసీ అధినేత్రి పార్టీ నుంచి బహిష్కరించారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే సందీపన్ సాహాను సైతం పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు అధికారిక ప్రకటన సైతం విడుదల చేశారు. పార్టీ అధినాయకత్వం తమ సంతకాలను ఫోర్జరీ చేసిందని ఆరోపించడంతో టీఎంసీ వీరిని సస్పెండ్ చేయడం గమనార్హం. అంతేకాకుండా పార్టీకి చెందిన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు కూడా టీఎంసీ ప్రకటించింది. వాటికి అనుబంధంగా ఉన్న సంస్థలు సైతం రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.
'తెలంగాణ సెంటిమెంట్.. ఒక ఫ్యాషన్ అయ్యింది'.. బీఆర్ఎస్పై రఘునందన్ రావు ఫైర్
ఇదిలా ఉంటే రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు రితబ్రతా బెనర్జీ.. మమతకు పార్టీలో కీలక పదవిని ఆఫర్ చేశారు. పార్టీ ముఖ్య సలహాదారుగా ఆమె ఉండాలని తాము అభ్యర్థిస్తున్నట్లు చెప్పారు. అయితే దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి మాత్రం పార్టీతో ఎలాంటి సంబంధం ఉండబోదని రితబ్రతా తేల్చి చెప్పారు. మెుత్తంగా చూస్తే ప్రస్తుత బెంగాల్ పాలిటిక్స్.. గతంలో మహారాష్ట్రలో జరిగిన రాజకీయాలను గుర్తుకు తెస్తున్నాయి. ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేనలో మెుదలైన చీలిక.. శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీ పార్టీతో ముగిసింది.

