BRS: స్వేచ్ఛ బ్యూరో: పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని, కొత్త రక్తాన్ని ఎక్కించాలని భావిస్తున్న అధిష్ఠానం.. ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం మళ్లీ పాత దారినే ఎంచుకుంటోంది.
తాజాగా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమ బాధ్యతలను సైతం తిరిగి మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలకే అప్పగించడంపై పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో ఓటమిపాలై, అధికారం కోల్పోయినా సరే.. సదరు నేతల్లో ఎలాంటి మార్పు రాలేదని, ఇప్పుడు మళ్లీ వారికే తాళాలు అప్పగిస్తే అసలుకే ఎసరు వస్తుందని ద్వితీయ శ్రేణి నాయకులు, నియోజకవర్గ కేడర్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ పాత నేతలకే..
గ్రామస్థాయి నుంచి బీఆర్ఎస్ పార్టీనిబలోపేతం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని భావిస్తున్న సభ్యత్వ నమోదు ప్రక్రియ ఆదిలోనే హంసపాదులా మారుతోంది. నియోజకవర్గాల్లో పార్టీని నమ్ముకుని ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని, అంకితభావంతో పనిచేసే కార్యకర్తలను పక్కనపెట్టి.. మళ్లీ పాత నేతలకే సభ్యత్వ బాధ్యతలను కట్టబెట్టడంపై పార్టీలో తీవ్ర చర్చజరుగుతుంది. ఓటమి తర్వాత కూడా నేతల తీరు మారలేదని, క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులకే మళ్లీ పెత్తనం ఇవ్వడంపై కేడర్ నైరాశ్యానికి గురవుతున్నారు.
గుర్తింపు దక్కదనే ఆందోళన..
గత ఎన్నికల్లో పరాజయం పాలై, అధికారం కోల్పోయినా చాలా నియోజకవర్గాల్లోని ముఖ్య నేతల్లో అహంభావం తగ్గలేదని పార్టీ శ్రేణులు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ, కేవలం తమ 'సొంత వర్గానికి' మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కోసం కష్టపడే అసలైన కార్యకర్తలను, ద్వితీయ శ్రేణి నాయకులను కలుపుకుని పోవడంలో ఈ మాజీలు ఘోరంగా విఫలమవుతున్నారనే ప్రచారం జరుగుతుంది. త్వరలో చేపట్టే సభ్యత్వ నమోదు బాధ్యతలు కూడా వీరి చేతుల్లోనే పెట్టబోతుండటంతో క్షేత్రస్థాయిలో అసలైన కార్యకర్తలకు గుర్తింపు దక్కదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలతో విసిగిపోయిన పలువురు నియోజకవర్గ స్థాయి కీలక నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
Heatwaves in AP: ఏపీ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక.. తీవ్ర వడగాల్పులు, ఆపై 47 డిగ్రీలు
పార్టీ శ్రేణులు 'గుస్సా'..
నియోజకవర్గాల్లోని పరిస్థితులు, నేతలపై ఉన్న వ్యతిరేకతపై స్పష్టమైన నివేదికలు ఉన్నప్పటికీ అధిష్ఠానం మళ్లీ పాత నేతలకే బాధ్యతలు అప్పగిస్తుండటంపై పార్టీ శ్రేణులు 'గుస్సా' అవుతున్నాయి. నాయకులను మార్చకపోగా, వారి గుప్పిట్లోనే సభ్యత్వ నమోదు వంటి కీలక బాధ్యతలు పెట్టబోతుండటం పార్టీకి ఆత్మహత్యాసదృశ్యమేనని హెచ్చరిస్తున్నారు. స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న నాయకులకు మళ్లీ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో సభ్యత్వ నమోదు లక్ష్యం దెబ్బతినే ప్రమాదముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాతైనా నియోజకవర్గాల్లో నాయకత్వం మారుతుందని, కొత్త రక్తం వస్తుందని ఆశించామని, కానీ అధిష్ఠానం మళ్లీ పాత కాపులకే పెత్తనం ఇస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీరు మారరు.. మమ్మల్ని కలుపుకోరు.. ఇలాగైతే గ్రౌండ్ లెవెల్లో పార్టీ బతికేదెలా?” అంటూ ఓ ద్వితీయ శ్రేణి నేత ఆవేదన వ్యక్తం చేశారు.
సభ్యత్వం పై ప్రభావం..
సభ్యత్వ నమోదుకు జిల్లాల వారీగా పార్టీ సమన్వయకర్తను నియమించింది. వారు సభ్యత్వ నమోదు ప్రక్రియను పర్యవేక్షించేందుకు నియోజకవర్గాలకు పార్టీ నియమిస్తున్న 'ఇన్చార్జీలు (సమన్వయకర్తలు)' సైతం నిష్పాక్షికంగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. స్థానిక మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు ఎవరి పేర్లయితే సూచిస్తున్నారో.. అధిష్ఠానం వారికే ఆ బాధ్యతలు కట్టబెడుతోందని ప్రచారం జరుగుతుంది. దీనివల్ల వచ్చే సమన్వయకర్తలు కూడా స్థానిక మాజీ నేతల మాట దాటలేరని, వారి కనుసన్నల్లోనే వ్యవహరిస్తారని స్పష్టమవుతోంది. ఫలితంగా కొత్తగా వచ్చే వారికి, అసంతృప్త నేతలకు న్యాయం జరిగే అవకాశం లేదని తేలిపోవడంతో ద్వితీయ శ్రేణి నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. నియోజకవర్గాలపై పాత నేతల పట్టు, వారి ఆధిపత్యమే కొనసాగుతోంది తప్ప.. కొత్త నాయకత్వం ఎదిగేందుకు ఎక్కడా అవకాశం దక్కడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ అసమ్మతి జ్వాలలు సభ్యత్వ నమోదుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

