Hariteja: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో 9 సీజన్లు పూర్తి కాగా..
పదవ సీజన్ కి రంగం సిద్ధమవుతోంది.. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ షోపై బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ ప్రముఖ నటి హరితేజ చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆ నరకంలోకి మళ్లీ వెళ్ళను.. సీజన్ 1లో థ్రిల్లింగ్ అనుభవాలు ఉన్నప్పటికీ… సీజన్ 8లో ఎదురైన చేదు జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి అంటూ ఆమె తెలిపింది. మరి అసలు ఎందుకు అంతలా ఎమోషనల్ అయింది? అసలేం జరిగింది ? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
బిగ్ బాస్ పై హరితేజ ఊహించని కామెంట్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా తొలిసారి బిగ్ బాస్ సీజన్ వన్ ప్రారంభించినప్పుడు ఎక్కువగా సినిమా సెలబ్రిటీలను కంటెస్టెంట్స్ గా తీసుకున్నారు. అలాంటి వారిలో హరితేజ కూడా ఒకరు.ఈ సీజన్ పై ఆమె మాట్లాడుతూ.. సీజన్ వన్ లో లోనోవాలా అడవుల్లో షూటింగ్ జరిగింది. రాత్రిపూట పులుల అరుపులు , పాముల భయం రాత్రిపూట నిద్రపట్టేది కాదు. అయినా సరే మేము చాలా ఎంజాయ్ చేసాము. కానీ సీజన్ 8 నా ఇమేజ్ ని దెబ్బతీసింది. నెగెటివిటీ వల్ల నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. అందుకే ఈ జన్మలో మళ్లీ బిగ్ బాస్ షోకి వెళ్ళను అందరూ తూర్పుకు మొక్కితే.. నేను మాత్రం అన్ని దిక్కులకు మొక్కుతాను అంటూ బిగ్ బాస్ హౌస్ అనుభవాలపై హరితేజ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ వన్ తనకు మంచి అనుభూతిని ఇచ్చినా.. సీజన్ 8 వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన తనకు అక్కడ పూర్తిగా నెగెటివిటీ ఏర్పడిందని..అందుకే ఇకపై ఆ హౌస్ లోకి వెళ్ళనని తెలిపింది హరితేజ.
నిర్మాత ఆర్.బి చౌదరి మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖ స్టార్ హీరో టీమ్!
హరితేజ కెరియర్..
1989 ఫిబ్రవరి 26న చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించిన ఈమె స్వతహాగా కూచిపూడి డాన్సర్. అమ్మ నాన్నలది ప్రేమ వివాహం. నాన్న మరాఠీ కుటుంబానికి చెందినవారు కాగా అమ్మ కన్నడ కుటుంబానికి చెందినవారు. తండ్రి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి. చదువు పూర్తి చేశాక మీడియా రంగంలో అడుగు పెట్టింది. ఇక 2007లో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా వచ్చిన అ ఆ చిత్రం ద్వారా మంగమ్మ పాత్రతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇందులో అద్భుతమైన పాత్రకు ఈమె నటనకు నటిగా మంచి గుర్తింపు కూడా లభించింది.
నటి మాత్రమే కాదు హోస్ట్ కూడా..
సినిమాలలోనే కాదు సీరియల్స్ లో కూడా సత్తా చాటింది హరితేజ. 2011 నుండి 2016 వరకు ప్రసారమైన మనసు మమత సీరియల్ లో ఏకంగా మూడు పాత్రలు పోషించింది. ఆ తర్వాత రక్తసంబంధం, అభిషేకం, కన్యాదానం, తాళికట్టు శుభవేళ , చిన్నారి , శివరంజని ఇలా ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అంతేకాదు సొగసు చూడతరమా, పండగ చేసుకో, సూపర్ సింగర్ వంటి షోలకు హోస్ట్గా కూడా వ్యవహరించింది.

