KTR: కరీంనగర్ నడిబొడ్డున ఉన్న జ్యోతినగర్లోని PMJ జ్యువెలరీ షాపులో జరిగిన దోపిడీ, కాల్పుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టోర్ సిబ్బందిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పరామర్శించారు.
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇతర బీఆర్ఎస్ నేతలతో కలిసి బాధిత కుటుంబాలను ఓదార్చిన కేటీఆర్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండేదని.. వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ను వెనక్కి నెట్టి దేశంలోనే నంబర్ వన్గా నిలిచామని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి పాలనలో నేరాలు.. ఘోరాలు పెరిగిపోయి తెలంగాణ నేడు బీహార్, యూపీలతో పోటీ పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. “కేసీఆర్ హయాంలో పోలీస్ శాఖకు తొలి జీవో ఇచ్చి.. రూ. 350 కోట్లతో ఆధునిక వాహనాలు.. ప్రతీ చౌరస్తాలో ఇంటర్ సెప్టర్ వాహనాలను ఏర్పాటు చేశాం. నేరం చేయాలంటేనే క్రిమినల్స్ భయపడేలా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశాం.” అని ఆయన పేర్కొన్నారు.
కరీంనగర్ లాంటి నగరంలో అది కూడా కోర్టుకు ఎదురుగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఆఫీస్ వెనకాలే ఇలాంటి ఘోరం జరగడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. “ఘటన జరిగి 32 గంటలు గడిచినా ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేకపోయారు. పోలీసులు అంటే కేవలం రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి.. సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తీసుకోవడానికి ఉన్న ప్రైవేట్ సైన్యమా?” అని ఆయన ప్రశ్నించారు. కేవలం ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకే పోలీసులను వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ కట్టించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కేవలం కూర్చోవడం కాదని.. పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయడం నేర్చుకోవాలని హితవు పలికారు. రాజధానిలోని కోఠీ బ్యాంక్ దోపిడీ.. చందానగర్ ఘటనలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: పాలమూరు గడ్డపై కవిత గర్జన.. కృష్ణా జలాల సాధనకు భారీ బహిరంగ సభ!

