దేశవ్యాప్తంగా బీజేపీ బలం మరోసారి పుంజుకుంది.ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతున్నదని ఓవైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.కానీ, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆ పార్టీ రెట్టింపు ఉత్సాహంతో విజయం సాధిస్తున్నది.
ఉపఎన్నికలు, అసెంబ్లీ, రాజ్యసభ ఎన్నికలు, కార్పొరేషన్ ఇలా ఏదైనా బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్, పుదుచ్చెరి, అస్సాంలో బీజేపీ ఘనవిజయం సాధించింది. బెంగాల్లో తొలిసారి కాషాయ పార్టీ విజయ ఢంకా మోగించగా.. 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఎంసీ కోటను బీజేపీ బద్దలుగొట్టింది. ఇక పుదుచ్చెరిలో ఎన్డీయే కూటమిలో భాగమైన పార్టీలు విజయం సాధించాయి. మరోసారి సీఎంగా రంగస్వామి ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు.
రాష్ట్రం ఏదైనా లెక్క ఒకటే..
అస్సాంలో గత రెండు పర్యాయలుగా అక్కడ ఎన్డీయే సర్కార్ ఉన్నది.తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ సీఎం హిమంత బిస్వశర్మ నేతృత్వంలోని బీజేపీ హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. దీనికి తోడు కమ్యూనిస్టు కంచుకోట కేరళలోనూ బీజేపీకి మూడు అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. దీంతో కమలదళం ఈ విజయాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటోంది.తాజాగా విజయంతో తెలంగాణ బీజేపీ సైతం ఊపు మీదుంది. బెంగాల్..మమత కోటను తాము బద్దలు కొట్టామని..తర్వాత టార్గెట్ తెలంగాణే అని బీజేపీ రాష్ట్రనాయకత్వం భావిస్తున్నది. ఈ మేరకు నిన్న సోషల్ మీడియాలో ఒక పోస్టు సైతం పెట్టింది. బెంగాల్ పని అయిపోయింది.. తర్వాతి టార్గెట్ తెలంగాణే అని ట్వీట్ చేసింది.
కమలం వికసిస్తుందా?
దేశంలో కమలం పార్టీ అధికారంలోకి రావడానికి చాలా ఫ్యాక్టర్స్ను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఉత్తరాది కంటే దక్షిణాదిలో మతరాజకీయాలు చాలా తక్కువ.ఇక్కడ బీజేపీ నమ్మే ప్రిన్సిపల్స్ను పెద్దగా ఎవరూ పట్టించుకోరు. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి పెద్దగా బలం కూడా లేదు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో కేడర్, సీట్లు పెరుగుతున్నాయి. ఇక్కడి ప్రజలు విద్యావంతులు. ప్రొగ్రెసివ్గా ఆలోచిస్తుంటారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు, అసెంబ్లీలో 7 వరకు సీట్లు వచ్చాయి. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ వశమైంది. నిజమాబాద్లో రెండో స్థానానికి పరిమితమైంది. పలుమున్సిపాలిటీలు సైతం ఆ పార్టీ ఖాతాలో చేరాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి అవకాశం ఉన్న ఎందుకు కష్టపడి పనిచేయడం లేదని ఆ మధ్య ప్రధాని మోడీ నేరుగా పార్లమెంట్ సభ్యులకు క్లాస్ పీకారు.దాని ఫలితం వచ్చే ఎన్నికల్లో కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది.
తొ
రాష్ట్ర నాయకత్వంపై విభేదాలు
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి పరిస్థితులు అనుకూలంగానే ఉన్నా.. రాష్ట్ర నాయకత్వంపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ఇక్కడి నాయకత్వం పార్టీకి డ్యామేజ్ చేస్తుంది తప్పా..కేడర్కు అండగా ఉండటం లేదని, ఎన్నికల్లో విజయం కోసం పనిచేయడం లేదని.. అధికారం పార్టీతో అంటకాగుతోందని చర్చ జరుగుతన్నది.గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర నాయకత్వంపై పలుమార్లు విమర్శలు గుప్పించారు. కేంద్రానికి సైతం లేఖలు రాశారు. అక్కడి నుంచి స్పందన కరువవడం, ఇక్కడి నాయకత్వం క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయన్ను సస్పెండ్ చేయడం జరిగింది. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర నాయకత్వంలో మార్పులు జరిగితే.. పార్టీ కోసం కష్టపడేవారికి అవకాశాలు ఇస్తే తెలంగాణలో అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమి కాదని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు.
