Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చచ్చిన పాము.. లేవని శవం.. మర మనిషి! కేసీఆర్‌పై ముప్పేట దాడి!

చచ్చిన పాము.. లేవని శవం.. మర మనిషి! కేసీఆర్‌పై ముప్పేట దాడి!

Big TV Live 3 weeks ago

క్క కేసీఆర్ పై మాటల దాడి ముమ్మరమైంది. ఒక్కరు కాదు.. ఒక పార్టీ కాదు.. ఏకంగా మూడు పార్టీలు. అధికార కాంగ్రెస్, బీజేపీ సహా కొత్తగా ఏర్పడిన టీఆరెస్ పార్టీకి సైతం ఇప్పుడు టార్గెట్ కేసీఆర్‌.

సీఎం రేవంత్ రెడ్డి బీఆరెస్ పార్టీని చచ్చిన శవంతో పోల్చారు. దీనికి ఎన్ని షోకులు చేసినా వేస్టే.. అది లేచేది లేదు.. బతికేది కాదు.. అని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. తనను పొద్దున లేచిన కాడ్నుంచి తన చావు కోరుకుంటున్నారని .. నువ్వు వెయ్యి జన్మలెత్తిన నేను చావను కొడకా!అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఆ విధంగా స్పందించారు.

నీ చావు నేనెందుకు కోరుకుంటాను..? కోరుకుంటే సీఎం సీటుకు ఆశపడుతున్న కేటీయారో..హరీశో కోరుకుంటారు గానీ..! అని వ్యంగ్యంగా కామెంట్ చేసిన ఆయన.. అసలు బీరెస్సే చచ్చిన శవమని వ్యాఖ్యానించడం ఆ పార్టీని మరింత డ్యామేజీ చేసినట్టయ్యింది. ఇక అంతకు ముందు కేసీఆర్ తనయ.. కవిత తన కొత్త పార్టీ ప్రకటన నేపథ్యంలో చేసిన ప్రసంగంలో తండ్రిపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ మారిన మనిషని, మర మనిషిగా మారిపోయాడని తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం రాజకీయాల్లో కలకలం రేపింది. ఆమె మాటలపై బీఆరెస్‌తో పాటు కొంత మంది కాంగ్రెస్ నాయకులు కూడా స్పందించారు. కవితను టార్గెట్ చేశారు. తండ్రిని ఆ విధంగా తూలనాడటం సరైంది కాదని హితవు పలికారు కొందరు కాంగ్రెస్ నేతలు.

అయితే ఆమె తన పార్టీని టీఆరెస్‌గా నామకరణం చేయడంలోనే.. బీఆరెస్‌కు మేమే ప్రత్యామ్నాయం అనే సంకేతమిచ్చే క్రమంలో సక్సెసయ్యారు. ఇక తండ్రి పట్టించుకోని అంశాలు.. పదేళ్ల పాలన లోపాలు.. ఆమె పాఠాలుగా స్వీకరించి.. కేసీఆర్, కేటీఆర్ వల్ల, బీఆరెస్ పాలన వల్ల దూరమైన సెక్షన్లన్నింటినీ దగ్గర తీసే ప్రయత్నం ఆమె చేస్తున్నారు. తన పార్టీ ఎజెండానే అది అనే విధంగా ఆమె మాట్లాడుతూ వస్తున్నారు. అంటే ఇకపై తండ్రిపై మరింత మాటల దాడి ఉంటుందనే సిగ్నల్ ఆమె ద్వారా వచ్చినట్టయ్యింది. దీన్ని నిలువరించేందుకు తండ్రీ బిడ్డల బాండింగ్‌, మమకారం విషయంలో కేటీఆర్ ఈ మధ్య మాట్లాడి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేశారు.

తండ్రికి కొడుకు కంటే బిడ్డె అంటేనే ప్రాణమని, బిడ్డెకే తండ్రి వద్ద ఎక్కువ చొరవ ఉంటుందని వ్యాఖ్యానించడం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నది. దీని ద్వారా ఓ బిడ్డె.. తండ్రిని దూషిస్తే అది ఆమెకే మైనస్ గా మారుతుందని, ప్రజల్లో వ్యతిరేకత భావం వస్తుందనే విధంగా కేటీఆర్ రాజకీయంగా ఆమెను ఎదుర్కొనే క్రమంలో ఈ మాటలన్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనికి కూడా కౌంటర్ ఇచ్చుకుంటున్నది కవిత టీమ్‌. ఇక తాజాగా కేసీఆర్‌ను తిట్టే పనిలో బీజేపీ కూడా చేరింది. ఆ పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్ .. ఇవాళ కేసీఆర్ ను, ఆ పార్టీని చెడామడా తిట్టేశారు. ఆ పార్టీ చచ్చిన పాముతో సమానమన్న ఆయన.. కేసీఆర్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని వ్యాఖ్యానించారు.

ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే.. దాన్ని నిర్వర్తించకుండా ఫామ్‌హౌజ్‌లో పండుకుంటున్నారని, అసెంబ్లీకి కూడా రావడం లేదని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతే కాదు.. బీఆరెస్‌కు, బీజేపీకి మధ్య పొత్తు ఉండదు.. మేము ఒంటరిగానే పోటీ చేస్తామని కూడా ప్రకటించి అందరి మనసుల్లో ఉన్న అనుమానాలను కూడా నివృత్తి చేశారాయన. ఇక ఈ మూడు ప్రధాన పార్టీలు ఒక్క కేసీఆర్‌ను టార్గెట్ చేశాయి. ముప్పేట దాడికి దిగాయి. అయితే కేసీఆర్‌కు ఇది కొత్తేం కాదు.. ఉద్యమ సమయం నుంచి ఆయన ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు. తిట్లు తిన్నారు. కానీ తను చేయాల్సింది చేసుకుంటూ వచ్చారు. కానీ అప్పటి సమయం వేరు. ఉద్యమంలో కేసీఆర్ తప్ప .. రథసారథిగా ఎవరూ కనిపించలేదు జనాలకు.

రాజకీయ వ్యూహాలు పన్ని, తెలంగాణ ఉద్యమాన్ని రగిలించి ముందుకు తీసుకుపోయేక్రమంలో వేసే ఎత్తుగడల్లో కేసీఆర్ ను మించిన వాడు లేడని అంతా భావించిన సమయం అది. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. పదేళ్లు అధికారం కూడా ఇచ్చి చూశారు జనం. ఇప్పుడు ఇంకా జనాన్నే తప్పు బట్టే విధంగా ఈ నేతలో పరివర్తన రాకపోవడం సానుభూతిని తెచ్చిపెట్టలేకపోతున్నది. తన పంథా కొంత చేంజ్ చేసుకుంటే తప్ప కేసీఆర్ పట్ల నమ్మకం ప్రోది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Big TV Live