Illegal Liquor: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన నందిన్నె వద్ద ఉన్న అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద అక్రమ మద్య రవాణాను అడ్డుకోవడానికి సివిల్ పోలీస్, ఎక్సైజ్ శాఖలు ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
తనిఖీలు నిర్వహించాల్సిన అధికారుల కళ్ల ముందే, చెక్ పోస్టుకు సరిగ్గా ఎదురుగా ఉన్న దాబాల్లో యథేచ్ఛగా అక్రమ మద్యం విక్రయాలు, సిట్టింగులు మండల ప్రజలు మండిపడుతున్నారు.
నిబంధనలు బేఖాతరు - పట్టపగలే మద్యం సిట్టింగులు
దాబాల్లో లిక్కర్ విక్రయించడం, తాగడానికి సిట్టింగులు ఏర్పాటు చేయడంపై చట్టపరంగా పూర్తి నిషేధం ఉంది. గతంలో ఎవరైనా గుట్టుచప్పుడు కాకుండా ఇలాంటి పనులకు పాల్పడేవారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. నందిన్నె సరిహద్దు దాబాల్లో ఎటువంటి అనుమతులు లేకుండానే మద్యం తాగేందుకు నిర్వాహకులు సిట్టింగ్ ఏర్పాటు చేయడం మండల ప్రజలు మండిపడుతున్నారు.
Also read: తెలంగాణలో పర్యాటకులకు ఇక పండగే.. సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్!
మామూళ్ల మత్తులో అధికారులు?
అక్రమాలను అరికట్టాల్సిన బాధ్యత కలిగిన ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు.. దాబా నిర్వాహకులు అందజేసే “మామూళ్లకు” అలవాటుపడిపోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళ్ల ముందే దాబాల్లో సిట్టింగ్ లు ఏర్పాటు సాగుతున్నా కనీస చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అధికారుల అండదండలతోనే ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విల్సిల్లుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
తక్షణ చర్యలకు డిమాండ్..
సరిహద్దు చెక్ పోస్టుల వద్ద తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నందిన్నె చెక్ పోస్టు ఎదురుగా అక్రమంగా సిట్టింగులు నిర్వహిస్తున్న దాబాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై విచారణ జరిపించాలని కోరుతున్నారు.
పుల్వామా దాడి మాస్టర్మైండ్ హమ్జా బుర్హాన్ హతం.. శరీరంపై బుల్లెట్ల వర్షం!

